Satya Nadella : యూఎస్ లో పద్మభూషణ్ అవార్డు తీసుకున్న సత్యనాదెళ్ల-జనవరిలో భారత్ కు
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తనకు కేంద్రం ఈ ఏడాది ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును యూఎస్ లో స్వీకరించారు. ప్రస్తుతం భారత్ కు వచ్చే అవకాశం లేకపోవడంతో యూఎస్ లోనే ఆయనకు అవార్డును అందజేశారు.
మరోవైపు సత్య నాదెళ్ల వచ్చే జనవరిలో భారత్లో పర్యటించనున్నారు.
భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు తనను ఎంపిక చేయడంపై సత్యనాదెళ్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం అందుకోవడం తనకు గౌరవంగా భావిస్తున్నానని, సాంకేతికతను మరింతగా సాధించేందుకు భారతీయులతో కలిసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నానని అవార్డు స్వీకరణ సందర్భంగా తెలిపారు. వచ్చే జనవరిలో భారతదేశాన్ని సందర్శించనున్న సత్యనాదెళ్ల.. గత వారం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టి.వి.నాగేంద్ర ప్రసాద్ నుంచి విశిష్ట సేవలకు గాను అధికారికంగా ఈ అవార్డును అందుకున్నారు.

ఈ ఏడాది భారత ప్రభుత్వం ప్రకటించిన 17 మంది పద్మభూషణ్ అవార్డు గ్రహీతల్లో సత్యనాదెళ్ల కూడా ఒకరు.
పద్మ భూషణ్ అవార్డును అందుకోవడం, చాలా మంది అసాధారణ వ్యక్తులతో కలిసి ఈ గుర్తింపు పొందడం గౌరవంగా భావిస్తున్నట్లు సత్య తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతికతను మరింత అభివృద్ధి చేసే క్రమంలో భారతీయులతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు సత్య వెల్లడించారు.
తనకు అవార్డు అందించిన భారత కాన్సుల్ జనరల్ నాగేంద్ర ప్రసాద్ తో సత్య నాదెళ్ల పలు విషయాలపై చర్చించారు. భారతదేశంలో అభివృద్ధి, ప్రపంచ రాజకీయ, సాంకేతిక అంశాల్లో దేశం పోషిస్తున్న పెద్దన్న పాత్రపై వీరు చర్చించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. మనం చారిత్రక ఆర్థిక, సామాజిక, సాంకేతిక మార్పుల కాలంలో జీవిస్తున్నట్లు ప్రసాద్తో తన సమావేశం తరువాత సత్య పేర్కొన్నారు. రాబోయే దశాబ్దం డిజిటల్ టెక్నాలజీతో నిర్వచించబడుతుందన్నారు. ఇందులో భారతీయ పరిశ్రమలు, సంస్థలు సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నాయని, అవి తక్కువతో ఎక్కువ పని చేయడంలో సహాయపడతాయన్నారు. ఇది అంతిమంగా గొప్ప ఆవిష్కరణ కానుందని, చురుకుదనం,స్థితిస్థాపకతకు దారి తీస్తుందన్నారు.












Click it and Unblock the Notifications