చైనా.. కుక్క తోక వంకరే! డోక్లాంలో బుద్ధి రాలేదు, ఈసారి టిబెట్ మీదుగా... రోడ్డు ప్లాన్!
‘కుక్క తోక వంకర ’ అన్న సామెత చైనాకు బాగా సరిపోతుంది. భారత్ సమర్థ ప్రతిఘటనతో డోక్లామ్ లో వెనక్కి తగ్గినట్టు కనిపించిన డ్రాగన్ దక్షిణాసియాలోకి చొరబడేందుకు మరో ‘దారి’లో ప్రయత్నిస్తోంది.
న్యూఢిల్లీ: : 'కుక్క తోక వంకర ' అన్న సామెత చైనాకు బాగా సరిపోతుంది. భారత్ సమర్థ ప్రతిఘటనతో డోక్లామ్ లో వెనక్కి తగ్గినట్టు కనిపించిన డ్రాగన్ దక్షిణాసియాలోకి చొరబడేందుకు మరో 'దారి'లో ప్రయత్నిస్తోంది.
భూటన్లోని ట్రైజంక్షన్లో రోడ్డు వేయబోయి భంగపడిన చైనా.. ఇప్పుడు దొడ్డిదారిని ఎంచుకొంది. నేపాల్ సరిహద్దులను కలిపే, టిబెట్లోని సుదీర్ఘ జాతీయ రహదారిని పునఃప్రారంభించింది.
టిబెట్లోని జిగాజే విమానాశ్రయం నుంచి ఆ సిటీ సెంటర్ దాకా.. పరుచుకొన్న 40.4 కిలోమీటర్లు పొడవు, 25 మీటర్ల వెడల్పు కలిగిన హైవేని శుక్రవారం తెరిచినట్టు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' కథనం ప్రచురించింది. దీనివల్ల ప్రయాణదూరం గంట నుంచి అరగంటకు తగ్గుతుందని తెలిపింది.
పౌర రవాణా అవసరాల కోసమని పైకి చెప్పినా.. వ్యూహాత్మకంగానే చైనా ఈ నిర్ణయం తీసుకొందని నిపుణులు చెబుతున్నారు. చైనా నుంచి నేపాల్కు రైల్వే లైన్ వేయాలని, తద్వారా దక్షిణాసియాలోకి చొచ్చుకురావాలని చైనా యత్నిస్తోంది.
చైనా తాజా నిర్ణయం ఆ వ్యూహంలో భాగమేనని, ఈ చర్య ద్వారా భౌగోళికంగా భారత్ను మరోసారి చైనా సవాల్ చేసినట్టే అయిందని అంటున్నారు. అసలు బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఏడాదిగా భారత్కు సమాచారం ఇవ్వని చైనా.. బంగ్లాదేశ్కు మాత్రం ఎప్పటికప్పుడు సమాచారమిస్తోంది.
తాజాగా వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నది నీటి వివరాలను కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్కు చైనా తెలిపినట్లు బీబీసీ కూడా పేర్కొంది. బంగ్లాదేశ్ జలవనరుల శాఖ మంత్రి కూడా ఈ సమాచారాన్ని ధ్రువీకరించడం గమనార్హం.
నిజానికి ఏటా మే15 నుంచి అక్టోబరు15 మధ్యలో భారత్కు ఈ సమాచారాన్ని చైనా అందించాల్సి ఉంటుంది. దీంతో అసోం, బిహార్ రాష్ట్రాల్లో వరదలు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకునే అవకాశం భారత్కు ఉంటుంది. కానీ, చైనా చివరిసారిగా 2016 జూన్లో మాత్రమే భారత్కు ఈ సమాచారమిచ్చింది.