విమానం: ఆల్ రైట్.. గుడ్ నైట్, పైలట్ సూసైడ్ కోణంలో..
కౌలాలంపూర్: మలేషియా ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉద్దేశ పూర్వకంగానే దారి మళ్లించారన్న కథనాల నేపథ్యంలో కాక్పిట్ నుంచి కో పైలట్ పంపిన చివరి సందేశ సంకేతాలు వెలుగు చూశాయి. ఫరీక్ అబ్దుల్ హమీద్ అనే కోపైలట్ గుడ్నైట్.. ఆల్రైట్ అన్న సందేశాన్ని పంపినట్టుగా చెబుతున్నారు.
పైలట్ ఆత్మాహుతి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. 239మంది ప్రయాణికులతో పది రోజుల క్రితం అదృశ్యమైన బోయింగ్ విమానం నుంచి చివరి సందేశం వచ్చిన విషయాన్ని సిఈఓ అహ్మద్ యాహ్యా ధృవీకరించారు. విమానంలోని ఆటోమేటిక్ ట్రాకింగ్ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం తర్వాత ఈ చివరి మాటలు నమోదైనట్టుగా తొలి కథనాలు చెబుతున్నాయి.

అయితే విమానం కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఎప్పుడు ఆపేశారన్న దానిపై తమకు స్పష్టమైన సంకేతాలేవీ లేవని యాహ్యా తెలిపారు. ఇప్పటి వరకైనా ప్రయాణికులెవరైనా ఫోన్ చేసినట్లు ఏ ఫోన్ కంపెనీ నుంచి ఆధారం అందలేదన్నారు. పైలట్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చనే అవకాశాలపై పోలీసులు దృష్టి పెట్టినట్లు ఒక ప్రశ్నకు సామాధానంగా మలేసియా రక్షణ, తాత్కాలిక రవాణా మంత్రి హిషముద్దీన్ హుస్సేనీ చెప్పారు.
విమానంలో ఉన్న వారికి ఎవరికైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయనే అంశాన్ని ఖండించారు. ఉత్తర, దక్షిణ కారిడార్లలో గాలింపు చర్యలు ఇప్పటికే మొదలయినట్లు తెలిపారు. ఇప్పటి వరకైతే సమాచారం రాకపోవడంతో ఆశలు సజీవంగానే ఉన్నాయన్నారు.
ఇదిలా ఉండగా గల్లంతైన విమానం అన్వేషణ మరింత ముమ్మరమైంది. ఉత్తర, దక్షిణ కారిడార్ ప్రాంత దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ తదితర దేశాలతో మలేషియా సంప్రదింపులు జరుపుతోంది. కాగా, తమకు విమానం గురించి ఎలాంటి సమాచారం లేదని కజకిస్తాన్ తెలిపింది.












Click it and Unblock the Notifications