38 మంది భార్యలు,89 మంది సంతానం-కన్నుమూసిన ఆ కుటుంబ పెద్ద జియోనా చనా
ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద దిక్కు జియోనా చనా (76) కన్నుమూశారు. మిజోరం రాజధాని ఐజాల్లోని ట్రినిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం(జూన్ 13) మధ్యాహ్నం 3గం. సమయంలో తుది శ్వాస విడిచారు. జియోనా చనా మరణాన్ని మిజోరం ముఖ్యమంత్రి జోరాంతంగ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
జియోనా చనా కొంతకాలంగా డయాబెటీస్,హైపర్ టెన్షన్ సమస్యలతో బాధపడుతున్నారు. జూన్ 7న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా.. అప్పటినుంచి ఏమీ తినట్లేదు. జూన్ 11వ తేదీన ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు ఆదివారమే ఆయన్ను ఐజాల్లోని ట్రినిటీ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికే ఆయన మృతి చెందారు.
జియోనా చనా మరణంపై ట్వీట్ చేసిన సీఎం జోరాంతంగ... 'ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన మిస్టర్ జియోనాకు బరువెక్కిన హృదయంతో మిజోరం వీడ్కోలు పలుకుతోంది. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు. జియోనా గ్రామం బక్తంగ్ త్లంగ్నాంతో పాటు మిజోరాం పర్యాటకులను ఆకర్షించడానికి అతని కుటుంబమే కారణం.' అని పేర్కొన్నారు.
జియోనా చనా జులై 21,1945లో జన్మించారు. ఆయనకు 38 మంది భార్యలు,89 మంది సంతానం,33 మంది మనవలు ఉన్నారు. ఆయన కుటుంబంలో మొత్తం 160 పైచిలుకు మంది ఉన్నారు. వీరంతా ఇప్పటికీ ఒకే ఇంట్లో ఉంటున్నారు. నాలుగంతస్తుల ఆ భవనంలో 100 గదులు ఉంటాయి. వృత్తి రీత్యా జియోనా వడ్రంగి. అంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఆర్థికంగా వారికేమీ ఇబ్బందులు లేవు. ఎందుకంటే కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక పనిచేస్తారు. జియోనాకు ఉన్న సాగుభూమిలోనే కుటుంబానికి అవసరమైన పంటలు,ధాన్యాలు పండిస్తుంటారు.పశువుల పెంపకంతో పాటు పౌల్ట్రీ కూడా నిర్వహిస్తుంటారు.
ఈ కుటుంబం ఒకరోజు తిండి కోసం 45 కిలోల బియ్యం,60 రకాల కూరగాయలు,25 కిలోల పప్పులు,20 కిలోల పండ్లు,డజన్ల కొద్ది కోడి గుడ్లు,30-40కోళ్లు అవసరమవుతాయి.జియోనా చనా మరణంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.