ఘనస్వాగతం:మోడీ అంటూ నినాదాలు (వీడియో)
న్యూయార్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు న్యూయార్క్ చేరుకున్నారు. ఆయన అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యూయార్క్ చేరుకున్నారు. ప్రధాని విమానం నుంచి క్రిందికి దిగివచ్చి అధికారులకు అభివాదం చేశారు.
ప్రధాని బస న్యూయార్క్లోని ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేశారు. ఆయన అక్కడికి చేరుకునే సరికి పెద్ద ఎత్తున భారతీయులు చేరుకున్నారు. వారు మోడీ... మోడీ... వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. మోడీ తమ చుట్టూ ఉన్న భారత, అమెరికా భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ అబిమానుల దగ్గరకు వెళ్లారు. కొందరితో ఆయన కరచాలనం చేశారు.
మోడీ ఐదు రోజులపాటు అమెరికాలో ఉంటారు. శనివారంనాడు ఆయన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు. భారత ప్రధాని న్యూయార్క్ చేరుకున్న అరగంటకే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగం ప్రారంభమైంది. కాశ్మీర్లో ప్లెబిసైట్ జరగాలని అంటూ ఆయన సంచలనం సృష్టించారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/14FFt9XwQzU?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
మోడీ ఆదివారంనాడు మేడిసన్లో ప్రసంగిస్తారు. మోదీ రెండు రోజులపాటు న్యూయార్క్లో గడిపిన అనంతరం ఆయన వాషింగ్టన్ వెళ్తారు. అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కీలకమైన చర్చలు జరుపుతారు. ఆయన ఒబామాతో రెండు సార్లు సమావేశమవుతారు. అయితే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో మాత్రం మోడీ ప్రత్యేకంగా చర్చలు జరిపే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ జపాన్లో పర్యటించారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల ఫలితంగా జపాన్, చైనాలనుంచి మోదీ దాదాపు 5500 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులకు వాగ్దానాలు సాధించగలిగారు.