మోడీ సర్కార్ కు సంకటం-తాలిబన్లను సమర్ధించలేక, వ్యతిరేకించలేక-ఆప్ఘన్ వ్యూహంపై మల్లగుల్లాలు
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పట్టు పెరుగుతోంది. రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అదే సమయంలో తమకు అండగా ఉంటున్న పాకిస్తాన్, మద్దతిస్తున్న చైనా కంటే తమ దేశంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన భారత్ కు తాలిబన్లు స్నేహహస్తం చాస్తున్నారు. తమ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పాకిస్తాన్ మద్దతు తీసుకుంటున్నా.. భారత్ తో గతంలో ఉన్న వాణిజ్య, దౌత్య సంబంధాలు మాత్రం యథాతథంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. అయితే తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే, సమర్ధించే విషయంలో మోడీ సర్కార్ మాత్రం ఇరుకునపడుతోంది.
తాలిబన్లకు స్వాతంత్ర్యం
ఆప్ఘనిస్తాన్ గడ్డపై రెండు దశాబ్దాలుగా తిష్ట వేసిన అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల బలగాలను పారద్రోలిన తాలిబన్లు. ఇవాళ్టితో తమకు పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. విదేశీ బలగాలు ఆప్ఘన్ విడిచి వెళ్లేందుకు ఆగస్టు 31 డెడ్ లైన్ పెట్టిన తాలిబన్లు.. ఇప్పుడు దాన్ని గౌరవించి అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల బలగాలు వెనక్కి వెళ్లిపోవడంతో దీన్ని తమ విజయంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచానికే తమ విజయం ఓ పాఠంగా మారబోతోందని తాలిబన్లు చెప్తున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వారికి మరో సవాల్ గా మారింది.
తాలిబన్ల సర్కార్ ఏర్పాటు
ఆప్ఘనిస్తాన్ గడ్డపై నుంచి విదేశీ బలగాలు ఒక్కొక్కటిగా వైదొలుగుతుండటంతో ఇక స్వయం పాలనకు తాలిబన్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తమ సుప్రీం కమాండర్ హైబతుల్లా అఖుంద్ జాదా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన తెరవెనుక ఉండి మరో కీలక నేత అబ్దుల్ ఘనీ బరాదర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలన సాగించనున్నారు. తాలిబన్ల ప్రభుత్వంలో ఎవరెవరుండాలనే దానిపైనా సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. రేపో మాపో దీనిపై తాలిబన్ల నుంచి అధికారిక ప్రకటన కూడా రాబోతోంది.
భారత్ తో సంబంధాలకు తహతహ
ఆప్ఘనిస్తాన్ ను పాలించేందుకు సిద్ధమవుతున్న తాలిబన్లు.. ఇస్లామిక్ ఎమిరేట్ గా దానికి పేరు పెట్టారు. కొత్త ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా కాకుండా ఇస్లామిక్ షరియత్ చట్టాల ఆధారంగానే పనిచేస్తుందని తాలిబన్లు కుండబద్దలు కొట్టేశారు. దీంతో ప్రజాస్వామ్యదేశాల నుంచి వారికి మద్దతు లభిస్తుందా లేదా అన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. అదే సమయలో మిగతా దేశాల కంటే కూడా భారత్ తో సత్సంబంధాల కోసం తాలిబన్లు తహతహలాడుతున్నారు. ఇప్పటికే తాలిబన్ల అధికార ప్రతినిధులు పదే పదే భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించారు. భారత్ తో గతంలో ఉన్న వాణిజ్య, దౌత్య సంబంధాలు పునర్ధరిస్తామని చెప్తున్నారు. దీంతో ఈ విషయంలో ఇప్పుడు భారత్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారిపోయింది.
మోడీ సర్కార్ కు సంకటం
రెండు దశాబ్దాలుగా తాము పెట్టుబడులు పెట్టిన ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో తాలిబన్ల పాలన రావడంతో ఇప్పుడు అక్కడి ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలనే దానిపై మోడీ సర్కార్ లో డైలమా కొనసాగుతోంది. ఎందుకంటే తాలిబన్లను వ్యతిరేకించిన అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి ఇన్నాళ్లూ మద్దతిచ్చిన భారత్.. ఇప్పుడు తాలిబన్లను సమర్ధించడం అంత సలువు కాదు. అలాగని అక్కడ తాము పెట్టిన వేల కోట్ల పెట్టుబడులు వృథా పోతుంటే చూస్తూ ఊరుకునే పరిస్ధితీ లేదు.. అలాగని ప్రజాస్వామ్యాన్ని కాదని షరియత్ చట్టాల అమలుకు సిద్ధమవుతున్న తాలిబన్లను సమర్ధిస్తే అంతర్జాతీయంగా కూడా ఇబ్బందులు తప్పవు. ఇప్పటివరకూ తాలిబన్లను తీవ్రవాదులుగా పేర్కొన్న భారత్ వారితో చర్చలు జరిపే పరిస్దితి కూడా లేదు. దీంతో అటు తాలిబన్లను సమర్దించలేక, అలాగని వ్యతిరేకించలేక, ఆప్ఘనిస్తాన్ లో పెట్టుబడుల్ని వదుకోలేక, ఈ వ్యూహాత్మక ప్రాంతంలో తమ ప్రాభవాన్ని వదులుకోలేక మోడీ సర్కార్ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఇప్పటివరకూ ఆప్ఘనిస్తాన్ విషయంలో మోడీ సర్కార్ నుంచి ఓ స్పష్టమైన ప్రకటన కూడా రావడం లేదు. నిన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఆప్ఘనిస్తాన్ లో మారిన పరిస్దితులు భారత్ పై దాడులు చేసే తీవ్రవాదులకు ఉపయోగపడకుండా చూస్తామన్న ప్రకటన మాత్రమే చేయగలిగారు. తాలిబన్ల నుంచి ఆఫర్లు వస్తున్నా కేంద్రం స్పందించకపోవడంపైనా అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతోంది.
Recommended Video