ఎంపీ ఇంట్లో సోదాలు.. కోట్లాది నగదు, 27 కేజీల బంగారం.. బంగారు లో దుస్తులు ???
ఇరాక్లో అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న సోదాలపై సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన వార్త విపరీతంగా ప్రచారమవుతోంది. ఆ దేశ మహిళా ప్రజాప్రతినిధి హింద్ అల్-అబ్బాసి నివాసంపై అధికారులు జరిపిన దాడిలో భారీ ఎత్తున నగదుతో పాటు విలువైన బంగారు వస్తువులు దొరికాయని ప్రచారం సాగుతోంది. దాదాపు 57 మిలియన్ డాలర్ల నగదు, 27 కిలోల మేలిమి బంగారంతో పాటు విలాసవంతమైన బంగారు లోదుస్తులు కూడా లభ్యమయ్యాయనే వార్త ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఈ వైరల్ వార్తలకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లతో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనే విషయంపై పలువురు ఆరా తీస్తున్నారు. నివేదికల ప్రకారం, సదరు ఎంపీ నివాసం నుంచి ఎలాంటి బంగారు లోదుస్తులు లేదా భారీ ఎత్తున నగదు లభ్యం కాలేదని తేలింది. ఈ ప్రచారం కేవలం ఊహాగానాల ఆధారంగానే సాగుతోందని స్పష్టమవుతోంది.

అసలు నిజా నిజాలు ఏమిటి?
గల్ఫ్ న్యూస్ వెల్లడించిన కథనం ప్రకారం, ఇరాక్ భద్రతా దళాలు ఇటీవల నిర్వహించిన ఒక భారీ దాడిలో ఎంపీ అలియా నాసిఫ్ నివాసం నుంచి సుమారు 15.5 మిలియన్ డాలర్ల నగదుతో పాటు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ప్రభుత్వం చేపట్టిన అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా ఆమెతో పాటు, గతంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె కుమారుడిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ వార్తనే కొందరు హింద్ అల్-అబ్బాసికి ముడిపెట్టి తప్పుడు కథనాలను సృష్టించారు.
ఇరాక్ దేశంలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించివేయడానికి అక్కడి ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపడుతోంది. ఇటీవల అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ చమురు శాఖ మంత్రి అద్నాన్ అల్ జుమైలీని ప్రశ్నించినప్పుడు వెల్లడైన కీలక సమాచారం ఆధారంగానే ఈ స్థాయిలో దాడులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ భారీ ఆపరేషన్లో భాగంగా ఇప్పటివరకు దాదాపు 60 మందికి పైగా ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియా వేదికగా ప్రచారమవుతున్న 27 కిలోల బంగారం, బంగారు లోదుస్తులు దొరికాయనే వివాదాస్పద వార్తలను ఇరాక్ అధికారిక వర్గాలు కానీ, ప్రభుత్వ మీడియా కానీ ఎక్కడా ధృవీకరించలేదు. ఈ ఆరోపణలు కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సృష్టించిన తప్పుడు ప్రచారాలు మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాక్లో అవినీతి సోదాలు వాస్తవమే అయినప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విచిత్రమైన వస్తువుల స్వాధీనం అనే అంశం పూర్తిగా కల్పితమని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications