ట్రంప్ 'అందుకే' గెలవాలని ముంబైలో యాగం, వేడెక్కిన 'అమెరికా'
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం భారత్లో పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. ముంబైలోని విష్ణుదాం ఆలయంలో ఈ రోజు యజ్ఞం చేశారు. ట్రంప్ గెలుపు కోసం ప్రవాస భారతీయుల తరఫున రెండో హోమాలు చేశామని ఆలయ ట్రస్ట్ తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్ గెలిచేందుకు విజయప్రాప్తి యజ్ఞం, అతని పరిపాలన సజావుగా సాగేందుకు శాసన్పాప్త్రి యజ్ఞం నిర్వహించారు. ట్రంప్ గెలుపొందితే ఎన్నారైలకు మంచి జరుగుతుందని, ఆయన గెలిస్తే భారత్లో ఉన్న తీవ్రవాదాన్ని నిర్మూలిస్తారని ఎన్నారైలు అభిప్రాయపడుతున్నారని చెబుతున్నారు.
కాగా, అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్లూరుతున్న హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ల మధ్య సమరం తుది అంకానికి చేరుకుంది. సర్వేలన్నీ వీరిద్దరి మధ్యా ఓట్ల తేడా అతి స్వల్పంగానే ఉంటుందని చెబుతుండడంతో తటస్థ ఓటర్లపై దృష్టి మళ్లింది.
తారల ప్రత్యేక ఆకర్షణతో గట్టెక్కవచ్చని హిల్లరీ భావిస్తుండగా, ట్రంప్ ఏ వర్గాన్నీ వదిలిపెట్టకుండా సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఫిలడెల్ఫియాలో జరిగే చివరి సభలో హిల్లరీతో పాటు భర్త బిల్ క్లింటన్, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు పాల్గొంటున్నారు.
ట్రంప్ వ్యక్తం చేసిన ప్రమాదకరమైన అభిప్రాయాల కారణంగా ఆయన అమెరికాలాంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి తగరని ఒబామాతో కలిసి హిల్లరీ చెప్పనున్నారు. ప్రత్యర్థి బలంగా ఉన్న రాష్ట్రాలపై ట్రంప్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అధ్యక్షుడు ఎవరో తేల్చే ప్రక్రియలో పాల్గొనే అర్హత 20 కోట్ల మందికి ఉంది. వీరిలో 4 కోట్ల మంది ముందస్తు ఓటింగ్ అవకాశాన్ని వినియోగించుకున్నారు.