ముషారఫ్కు ఆదిలోనే దెబ్బ, ఇమ్రాన్ ఖాన్ సహా ఎవరూ ముందుకు రావట్లేదు
పాక్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ 23 పార్టీలతో కలిసి పాకిస్థాన్ అవామీ ఇత్తెహాద్ (పీఏఐ) పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశారు.
ఇస్లామాబాద్: పాక్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ 23 పార్టీలతో కలిసి పాకిస్థాన్ అవామీ ఇత్తెహాద్ (పీఏఐ) పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షునిగా ముషారఫ్, ప్రధాన కార్యదర్శిగా ఇక్బాల్ దర్ వ్యవహరిస్తారు.
దుబాయ్ నుంచి ప్రత్యక్ష ప్రసార సదస్సు పద్ధతిలో విలేకరులతో ముషారఫ్ మాట్లాడారు. ముహాజిర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలన్నీ ఏకం కావాలన్నారు. కూటమిలో సభ్యులుగా ఉన్న పార్టీలన్నీ ఒకే పేరుతో పోటీ చేస్తాయన్నారు. తమ కూటమిలో మరిన్ని పార్టీలు చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధ్యక్షులు ఇమ్రాన్ఖాన్ సొంతపార్టీ గురించే ఆలోచిస్తారని ముషారఫ్ విమర్శించారు. ఆ పార్టీ కూడా తమ కూటమిలో చేరితే మేలు అన్నారు. త్వరలోనే తాను పాకిస్థాన్కు వస్తాననీ, దేశంలో పరిస్థితులు మెరుగైన దృష్ట్యా తనకు ఎలాంటి భద్రతా అవసరం లేదన్నారు. తనపై వచ్చిన అభియోగాలకు కోర్టులోనే సమాధానం చెబుతానన్నారు.
ఇదిలా ఉండగా, ముషారఫ్ స్థాపించిన కూటమిలో చేరేందుకు పలు పార్టీలు విముఖత చూపుతున్నాయి. పీటీఐ, ముత్తాహితా క్వామీ మూమెంట్, పాక్ సర్జామీన్ పార్టీ, మజ్లిస్ వహెదత్ ఈ ముస్లీమన్, సున్నీ ఇత్తేహద్ కౌన్సెల్ ఇలా 23 పార్టీలు తమతో చేతులు కలపాలని ఆయన కోరగా, ఆయా పార్టీలు మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు.