కొత్త ఆర్థికశాఖ మంత్రిగా రిషి సునక్.. ఎవరీయన..?
లండన్: ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈ పదవిని సాజిద్ జావిద్ చేపట్టారు. అయితే కొన్ని అనుకోని కారణాలతో ఆయన రాజీనామా చేశారు. గతేడాది జూలై నుంచి ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిషి సునక్ ఆర్థికశాఖ మంత్రిగా నియమితులైనట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.
కొత్త ఆర్థికశాఖ మంత్రిగా రిషి సునక్
యార్క్షైర్లోని రిచ్మండ్ ఎంపీగా సునక్ ఉన్నారు. సునక్ కేబినెట్లో చేరడంతో హోమ్ సెక్రటరీగా ఉన్న మరో భారత సంతతి వ్యక్తి ప్రీతి పాటిల్ సరసన నిలిచారు. ఇక ప్రధాని కార్యాలయం పక్కనే ఉన్న 11 డౌనింగ్ స్ట్రీట్కు రుషి సునక్ మారనున్నారు. ప్రధాని తర్వాత ఆర్థికశాఖ మంత్రికే బ్రిటన్ ప్రభుత్వంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఆర్థికశాఖ మంత్రిగా రిషి సునక్ నియామకానికి క్వీన్ కూడా ఆమోద ముద్ర వేసిందని ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గురువారం రోజున సాజిద్ జావీద్ రాజీనామా చేసిన నేపథ్యంలో సునక్కు ప్రమోషన్ లభించింది. బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత కొన్ని వారాలకే సాజిద్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
Recommended Video

ప్రధాని బోరిస్ కేబినెట్లో మార్పులు చేర్పులు
ఇక ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్లో మార్పులు చేర్పులు చేయనున్న నేపథ్యంలో సాజిద్ జావీద్కు చెందిన కొంతమంది సలహాదారులను మార్చాలన్న నిర్ణయానికి బోరిస్ రావడంతో సాజిద్ అలకబూని రాజీనామా చేసినట్లు సమాచారం. సాజిద్ రాజీనామా చేయగానే బోరిస్ వెంటనే ఆమోదించి రిషి సునక్తో భర్తీ చేశారని సమాచారం. బ్రిటన్ కష్టకాలంలో ఉన్న సమయంలో జావిద్ మంత్రి పదవికి రాజీనామా చేయడం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

అలకబూని రాజీనామా చేసిన సాజిద్ జావీద్
పార్లమెంటు ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ గెలిచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా గురువారం తను కేబినెట్లో మార్పులు చేర్పులు చేశారు. బోరిస్ జాన్సన్ సన్నిహితుడైన డామినిక్ కమ్మింగ్స్తో జావీద్కు బేదాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది. అయితే ప్రధాని బోరిస్తో భేటీ తర్వాత జావీద్ రాజీనామా చేస్తారనే వార్తలు జోరందుకున్నాయి. జావీద్ వద్ద పని చేస్తున్న సలహాదారులందరినీ మార్చి కొత్త టీమ్ను తీసుకురావాలని ప్రధాని బోరిస్ కోరడంతో జావీద్కు ఇది నచ్చలేదని, ఆత్మగౌరవం ఉన్న ఏ మంత్రి ఈ పనిచేయలేడని భావించి రాజీనామా చేశారని అతని సన్నిహితులు చెబుతున్నారు.
ఇక బ్రెగ్జిట్ అంశంపై రాజకీయ పోరాటం చేసి విజయం సాధించిన బోరిస్ ఇక దేశంలోని స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని భావించారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ, ఆరోగ్యశాఖ, మౌలికసదుపాయల రంగాలకు నిధులు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక మరో వ్యక్తి అలోక్ శర్మను కూడా యూఎన్ వాతావరణ సమాఖ్య ఇంఛార్జ్ మంత్రిగా నియమించనున్నారు.












Click it and Unblock the Notifications