యుకె ఎంపిగా గెలిచిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు
లండన్: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్ యుకె ఎన్నికల్లో ఎంపిగా విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన గెలుపొందారు. ఆయన నార్త్ యార్క్షైర్లోని రిచ్మాండ్ ఎంపిగా భారీ మెజారిటీతో మొదటిసారి గెలిచారు.
సునాక్ యుకెలోని సౌతాంప్టన్ నగరంలో జన్మించారు. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ పట్టాలు పొందారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో సునాక్కు నారాయణ మూర్తి కూతురు అక్షత పరిచయమైంది.
అక్షత, సునాక్ల వివాహం 2009లో కర్ణాటక రాజధాని బెంగళూర్లో జరిగింది. కన్జర్వేటివ్ పార్టీకి అధిక బలం ఉన్న రిచ్మాండ్ నుంచి కన్జర్వేటివ్ నేత విలియం హాగ్ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆయన నిరుడు విదేశీ వ్యవహారాల కార్యదర్సి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం సునాక్కు లభించింది.
అందుకు నారాయణ మూర్తి హర్షం వ్యక్తం చేశారు. రిషి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధిపై రిషి చిత్తశుద్ధితో పనిచేస్తాడని ఆయన అన్నారు. ఎంపిగా తన బాధ్యతలు తాను సక్రమంగా నిర్వహించగలడనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.