'మోనాలిసా ఆఫ్ ఆఫ్ఘన్'ను అరెస్టు చేసిన పాక్ పోలీసులు
పెషావర్ : ఒక్క ఫోటో ఆమెను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క డాక్యుమెంటరీ ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. అయితే అది కొంతకాలానికే పరిమతమైపోయింది. ఆ తర్వాత చాలారోజుల వరకు వార్తల్లో ఎక్కడా ఆమె గురించిన ఊసే లేదు. అయితే ఇన్నాళ్లకు మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
కాగా, ఈసారి 'అరెస్టు'తో ఆమె వార్తల్లోకి ఎక్కడం గమనార్హం. ఇంతకీ ఎవరా మహిళ అంటే..? 'మోనాలిసా ఆఫ్ ఆఫ్ఘన్ వార్' గా ప్రపంచం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్న 'షర్బత్ బీబీ'. బీబీతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు నకిలీ గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణల కింద పాక్ పోలీసులు బీబీని అదుపులోకి తీసుకున్నారు.
బుధవారం నాడు ఆమెను నిర్బంధంలోకి తీసుకున్న విషయాన్ని 'ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ'(ఎఫ్ఐఏ) ధ్రువీకరించింది. ఇదిలా ఉంటే, ఆఫ్ఘన్ లో పరిస్థితుల కారణంగా.. ఆమె చాలాకాలంగా పాక్ లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో పాక్ కే చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది బీబీ.
ఆ ఒక్క ఫోటో
1984లో పెషావర్ లోని శరణార్థుల శిబిరంలో బీబీ తలదాచుకుంటున్న సమయంలో.. ప్రముఖ నేషనల్ జియో గ్రాఫిక్ కు చెందిన ఫోటోగ్రాఫర్ మెక్ కర్రీ ఆమె ఫోటోను తన కెమెరాలో బంధించారు. అనంతరం 1985 నేషనల్ జియోగ్రాఫిక్ ఎడిషన్ పై ఆ ఫోటోను ముఖచిత్రంగా ముద్రించింది సంస్థ.
12ఏళ్ల వయసులో.. ముదురు రంగు దుప్పట్టాను తలమీది నుంచి కప్పుకుని.. నీలికళ్లతో ఉరిమి చూస్తున్నట్లున్న ఆ ఫోటో.. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాతి కాలంలో నేషనల్ జియో గ్రాఫిక్ షర్బత్ బీబీపై ఓ డాక్యుమెంటరీని కూడా ప్రసారం చేసింది.
బీబీ 12ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇదంతా జరగ్గా.. ఆ తర్వాత ఆమె గురించిన ప్రస్తావన ఎక్కడా లేకుండాపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె వార్తల్లోకి ఎక్కడంతో.. పలువురు ఆమె గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు.