నేతాజీ మరణం: '1945 తర్వాత జీవించే ఉన్నారు'
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన దస్త్రాలు బహిర్గతమైనప్పటికీ ఆయన అదృశ్యం, మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెలాఖరులో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నేతాజీ విషయమై భారత్-రష్యా మధ్య కొనసాగిన లేఖలను బోస్ మేనల్లుడు, ఇండిపెండెంట్ జర్నలిస్టు ఆశిష్ రాయ్ మంగళవారం లండన్లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాయా మాట్లాడుతూ తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదని, ఈ విషయం రష్యాకు కూడా తెలుసని స్పష్టం చేశారు. తాను విడుదల చేసిన పత్రాల్లో ఈ విషయం స్పష్టంగా ఉందని రాయ్ పేర్కొన్నారు. 1945కు సంబంధించి బోస్ వివరాలు కోరుతూ 1991, 1995 మధ్య భారత్, రష్యాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల నకళ్లను ఆయన వెల్లడించారు.
1945 లేదా ఆ తర్వాతి సంవత్సరాల్లో రష్యా భూ భాగంలోకి నేతాజీ ప్రవేశించారా? అని అప్పటి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని రాయ్ చెప్పారు. ‘1991 సెప్టెంబర్లో భారత ప్రభుత్వం రష్యా ఫెడరేషన్కు లేఖ రాసింది. బోస్ మీ దేశానికి రావడం లేదా అక్కడ ఉండడం జరిగిందా? అని భారత్ అడిగింది' అని ఆయన పేర్కొన్నారు.
భారత్ లేఖపై 1992 జనవరిలో రష్యా బదులిస్తూ ‘బోస్ మా దేశం వచ్చినట్టుగానీ ఇక్కడ ఉన్నట్టుగానీ సమాచారం లేదు' అని స్పష్టం చేసినట్టు ఆయన వివరించారు. మరో మూడేళ్ల తర్వాత మరోసారి కూడా భారత ప్రభుత్వం రష్యాకు లేఖ రాసింది.
1945, ఆ తర్వాత ఎప్పుడైనా నేతాజీ సోవియట్ యూనియన్కు వచ్చారా, అక్కడ కొంతకాలం ఉన్నారా అన్నది పురాతత్వ, చారిత్రక విభాగాలను సమన్వయం చేసుకొని కచ్చితంగా నిర్ధారించాలని భారత్ కోరింది. అయినా రష్యా తన పాత సమాధానాన్నే పునరావృతం చేసింది.
అయితే రెండు దేశాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు పరిశీలిస్తే నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయినట్టు కచ్చితమైన ఆధారాలు లేవని దీనిపై ప్రభుత్వం కూడా ఓ నిర్ధారణకు రాలేకపోయిందన్న సంగతి అర్థమవుతోందని అన్నారు. కాగా, 1945 ఆగస్టు 18న తైవాన్లోని తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు చెప్తున్నారు.
ఆ తేదీన విమాన ప్రమాదం జరిగితే.. అందుకు ఆధారాలు చూపించాలని వారు కోరుతున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ ఈ వాదనను విశ్వసించడం లేదు. కాగా బోస్కు సంబంధించిన పత్రాలను ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీ నృపేంద్ర మిశ్రాకు రాయ్ అందజేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలే నేతాజీకి సంబంధించిన 64 ఫైళ్లను బహిర్గతం చేశారు. 1945 ఆగస్టు 18 తైవాన్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.