కరోనా పై విజయం సాధించిన తొలి దేశం ఇదే..ఆ ప్రధాని తీసుకున్న చర్యలే కారణమా..?
వెల్లింగ్టన్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ పై ఆ దేశం దాదాపుగా విజయం సాధించింది. గత కొద్ది రోజులుగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతో మంగళవారం నుంచి ఆదేశంలో అన్నీ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ దేశ ప్రజలంతా ఒకరినొకరు పలకరించుకుంటూ పార్టీలు చేసుకుంటూ కనిపించారు. ఇంతకీ ఆ దేశం ఏంటి..? ఆ దేశ ప్రభుత్వం ఎలా విజయం సాధించింది...?
Recommended Video
మహమ్మారిపై విజయం సాధించిన కివీస్
న్యూజిలాండ్.. ఓ చిన్న దేశం. ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తుండగా కివీస్ దేశం మాత్రం ఆ మహమ్మారిపై పోరాటం చేసి దాదాపుగా విజయం సాధించింది. ఇందుకు కారణం ఆ దేశం అవలంబించిన కఠిన చర్యలే. ఇక మూడు నెలలుగా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు లేకుండా కోవిడ్-19పై విజయం సాధించాలనే లక్ష్యంతో పనిచేసిన ప్రభుత్వం ఎట్టకేలకు మంచి ఫలితాన్ని సాధించింది. కరోనా వైరస్ నుంచి న్యూజిలాండ్ దేశం పూర్తి విముక్తి పొందిందంటూ ప్రకటన చేసింది ప్రభుత్వం. దీంతో మూడు నెలల తర్వాత దేశంలో తొలిసారిగా అన్ని వాణిజ్య సముదాయాలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఒక ఎడారిని తలపించిన కివీస్ దేశం తిరిగా సాధారణ స్థితికి చేరుకుని సందడిగా మారింది.
సందడిగా కనింపించిన న్యూజిలాండ్
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కెఫేలు, మాల్స్, స్టేడియంలు, నైట్క్లబ్బులు, బహిరంగ సమావేశాలపై ఉన్న పరిమితులు ఆంక్షలను ఎత్తివేసింది. దాదాపుగా సాధారణ స్థితికి చేరింది. ప్రజలు రోడ్లపై తిరుగుతూ ఆ దేశమంతా సందడిగా కనిపించింది. ప్రజలంతా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని తిరుగుతూ, షాపింగ్ చేస్తూ రెస్టారెంట్లలో భోజనం చేస్తూ కనిపించారు. ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి నుంచి న్యూజిలాండ్ దేశం కోలుకుంటుండగా ప్రపంచంలోనే అతిపెద్ది ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, భారత్లాంటి దేశాలను ఇంకా ఈ వ్యాధి వణికిస్తోంది. అయితే న్యూజిలాండ్ ఈ మహమ్మారిపై పోరాడి విజయం సాధించడం సాధారణ విషయం కాదు.
కఠిన నిబంధనలే విజయంకు కారణమా..?
కరోనావైరస్ మహమ్మారి న్యూజిలాండ్ను తాకగానే ఆ దేశ ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకొచ్చింది. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించింది. ఈ వైరస్ సీరియస్నెస్ తెలుసుకున్న ప్రభుత్వం కష్టమైనప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేసింది. దీంతో ఎన్నో వ్యాపార సముదాయాలు, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక దేశంలో ఒక్క కరోనా వారియర్లు తప్ప మిగతా వారంత ఇళ్లకే పరిమితం కావాలనే కఠిన నిబంధనలను తీసుకొచ్చి సక్సెస్ అయ్యింది జేసిండా ప్రభుత్వం. దేశం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం ఎక్కడా సామాజిక దూరం పాటించాల్సిన అవసరం లేకపోవడంతో అక్కడి వ్యాపారస్తులు, ఇతర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అన్నిటికీ అనుమతి.. ఆంక్షలు లేవు
ఆఫీసులు తిరిగి తెరుచుకోగా... బస్సులు, రైళ్లు ప్రయాణికులతో క్కికిరిసిపోయాయి. అయితే ఇప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కార్యాలయాల ముందు శానిటైజర్లు ఉంచారు. అయితే శానిటైజర్ వినియోగించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ జాగ్రత్త చర్యలు మాత్రం కొన్ని సంస్థలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పబ్స్ కూడా ప్రారంభం కావడంతో శుక్రవారం రోజున పబ్బులన్నీ హౌజ్ ఫుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్టేడియంలలో ప్రేక్షకులను అనుమతించే తొలి దేశంగా న్యూజిలాండ్ నిలవనుంది. స్టేడియంలోకి ప్రేక్షకుల సంఖ్యపై కూడా పరిమితి లేదు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత డొమెస్టిక్ రగ్బీ టోర్నమెంట్ ప్రారంభం కానుండటంతో చాలామంది ఈ ఆటను వీక్షించేందుకు స్టేడియంలకు చేరుకుంటారని సమాచారం.
క్రెడిట్ ఎవరిది..?
ఇక న్యూజిలాండ్ ఈ మహమ్మారిపై విజయం సాధించిందంటే అందుకు కారణం ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే కారణం అని చెబుతున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే ఈ క్రెడిట్ అంతా తన హెల్త్ చీఫ్ ఆష్లే బ్లూంఫీల్డ్దే అని ప్రధాని జెసిండా చెప్పారు. ఇక దేశం నుంచి ఈ మహమ్మారి పారిపోవడంతో ప్రజలంతా సంతోషంతో జీవితాలను ప్రారంభించాలని ఆకాంక్షించారు జేసిండా. అయితే న్యూజిలాండ్లోని వస్తువులనే కొనుగోలు చేయాలని బయటి వాటికి గుడ్బై చెప్పేయాలని హెల్త్ చీఫ్ ఆష్లే చెప్పారు. అన్నీ చెబుతూనే జాగ్రత్తలు మాత్రం మరవకూడదంటూ హెచ్చరించారు. తమ దేశం నుంచి కరోనా పోయినప్పటికీ.. తమతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల్లో మాత్రం ఇది పంజా విసురుతోందన్న విషయాన్ని మరవరాదని చెప్పారు ఆష్లే.