లాస్ ఏంజిలిస్ మేయర్ గా మలయాళీ?
లాస్ ఏంజిల్స్ మేయర్ ఎన్నికల ప్రాథమిక పోరులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోస్టల్, ప్రొవిజనల్ బ్యాలెట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోండగా, సిటీ కౌన్సిల్ సభ్యురాలు నిత్య రామన్ అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. రియాలిటీ టీవీ స్టార్ స్పెన్సర్ ప్రాట్ను వెనక్కి నెట్టి, రెండో స్థానానికి చేరుకున్నారు. ఫలితంగా నవంబర్లో జరగబోయే రన్ఆఫ్ ఎన్నికల్లో సిట్టింగ్ మేయర్ కరెన్ బాస్ను ఢీకొనే అవకాశం కోసం ఏర్పడింది.
అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం వెలువడిన తాజా ఫలితాల్లో నిత్య రామన్ 27.12 శాతం ఓట్లను సొంతం చేసుకొన్నారు. 26.69 శాతంతో ఉన్న స్పెన్సర్ ప్రాట్ను అధిగమించారు. ఇప్పటివరకు సుమారు 83 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. వీరిద్దరి మధ్య వ్యత్యాసం దాదాపు 3,100 ఓట్లు. మరోవైపు సిట్టింగ్ మేయర్ కరెన్ బాస్ 34.68 శాతంతో స్పష్టమైన ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. నవంబర్ రన్ఆఫ్ ఎన్నికల్లో తన స్థానాన్ని ఇప్పటికే సుస్థిరం చేసుకున్నారు.

లాస్ ఏంజిలిస్ మేయర్ అభ్యర్థి ఎన్నిక కోసం జూన్ 2న పోలింగ్ జరిగింది. ఆరంభంలో స్పెన్సర్ ప్రాట్ భారీ ఆధిక్యత సాధించారు. రెండో స్థానంలో ఉండి అందరి దృష్టిని ఆకర్షించారు. భద్రత, నేరాల నియంత్రణ, ప్రభుత్వ కార్యనిర్వాహక సామర్థ్యాన్ని ప్రధానాంశాలుగా చేసుకుని ప్రచారాన్ని సాగించారు. సోషల్ మీడియాలో ఉన్న భారీ ఫాలోయింగ్ను ఉపయోగించుకుని, ముఖ్యంగా యువత, సంప్రదాయవాద మద్దతుదారులను ఆకట్టుకోవడంలో సఫలీకృతం అయ్యారు. పలువురు ప్రముఖ రాజకీయ వ్యక్తుల మద్దతు కూడా ఆయనకు లభించింది.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పెరిగేకొద్దీ మారుతున్న ఓట్ల సరళి పరిస్థితిని మార్చివేసింది. సాధారణంగా కాలిఫోర్నియా ఓటింగ్ విధానంలో ఫలితాల చివరలో ప్రోగ్రెసివ్ అభ్యర్థులకు మద్దతు కలిసివస్తుంటుంది. ఇదే కోవలో నిత్య రామన్ అంచలంచెలుగా పుంజుకుంటూ ప్రాట్ ప్రారంభ ఆధిక్యాన్ని తగ్గించేశారు. ఫిబ్రవరిలో బరిలోకి దిగిన నిత్యా రామన్, గృహ నిర్మాణ సంస్కరణలు, నిరాశ్రయుల సమస్యకు శాశ్వత పరిష్కారాల హామీలతో మేయర్ అభ్యర్థిగా బలమైన పోటీదారుగా ఎదిగారు.
ఈ సుదీర్ఘ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్పెన్సర్ ప్రాట్ వర్గంలో కొంత అసహనానికి దారితీసింది. గత వారాంతంలో, ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరును ఎద్దేవా చేస్తూ ప్రాట్ సోషల్ మీడియాలో ఒక మీమ్ పోస్ట్ చేశారు. మార్జిన్ తగ్గుతుండటంతో ఆయన మద్దతుదారుల్లో పెరుగుతోన్న ఆందోళనను ఇది ప్రతిబింబిస్తోంది.
పోటీలో ఉన్న ఏ అభ్యర్థికి కూడా 50 శాతానికి పైగా ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో, నవంబర్ 3న టాప్-టూ రన్ఆఫ్ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కరెన్ బాస్తో తుది పోరులో ఎవరు నిలుస్తారనేది పెండింగ్ బ్యాలెట్ల ద్వారా తేలనుంది. కరేన్ బాస్- నిత్యా రామన్ పోటీ జరిగితే, అది నగర అభివృద్ధి పథంలో మార్పులపై చర్చకు దారితీస్తుంది. అదే బాస్-ప్రాట్ పోటీ, డెమోక్రటిక్ వ్యవస్థకు, సెలబ్రిటీ-ఆధారిత పాపులిస్ట్ ప్రచారానికి మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతుంది.












Click it and Unblock the Notifications