కీలుబొమ్మతో చర్చలు జరపం: పాక్పై తాలిబన్
ఇస్లామాబాద్: అమెరికా చేతిలో కీలుబొమ్మ లాంటి పాకిస్థాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపబోమని ఉగ్రవాద సంస్థ తాలిబన్ స్పష్టం చేసింది. శుక్రవారం అమెరికా దళాలు దాడి చేసి తాలిబన్ అధినేత హకీముల్లా మసూద్ను హత్య చేసిన నేపథ్యంలో ఆ సంస్థ పై విధంగా వ్యాఖ్యానించింది.
సంస్థలోని ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం పాకిస్థాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపకూడదని నిర్ణయించుకున్నట్లు తాలిబన్ పేర్కొంది. తెహ్రీక్ ఇ తాలిబన్ అధికార ప్రతినిధి షాహిదుల్లా షాహిద్ పాకిస్థాన్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిందని, శాంతి చర్చల పేరుతో తమను మోసం చేసిందని ఆరోపించారు.
తాలిబన్ అధినేత మసూద్ హత్య కేసును చూస్తుంటే... పాకిస్థాన్ ప్రభుత్వానికి శాంతి చర్చలు జరిపే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోందని ఆయన తెలిపారు. తాము అమాయక పాకిస్థాన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనుకోవడం లేదని, అందుకే ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరుకున్నట్లు చెప్పారు. అయితే ఎప్పుడైతే తమ నేతను అమెరికా దళాలు హత్య చేశాయో.. అప్పుడే పాకిస్థాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలపై నమ్మకం పోయిందని, శాంతి చర్చల విషయంలో ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
కాగా తాలిబన్ నేత మసూద్ను అమెరికా దళాలు హత్య చేయడం పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంతో సంబంధాలను సమీక్షించుకునేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని మంత్రి మండలి సోమవారం సమావేశం కానుంది. అమెరికా దాడులతో శాంతి చర్చలకు విఘాతం కలిగిందని పాక్ దేశీయ వ్యవహారాల మంత్రి చౌధరి నిసార్ తెలిపారు.
ఇది ఇలా ఉండగా పాకిస్థాన్ తాలిబన్లకు ఆల్ ఖైదాతో సంబంధాలున్నాయని, అది ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని అమెరికా పేర్కొంది. కాగా ఉత్తర వజీరిస్థాన్లో డ్రోన్ దాడిలో మృతి చెందింది మసూద్ అని ఇంకా ధృవీకరించలేదని ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.