పాకిస్థాన్లో మరో హిందూ ఆలయంపై దాడి, ధ్వంసం: అరెస్ట్ లేదు,కేసూ లేదు, భారత్ ఆగ్రహం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్లో మైనార్టీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ దేవాలయాలు యధేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లోని పలు ప్రముఖ ఆలయాలను నేలమట్టం చేసిన అక్కడి ముస్లింలు.. తాజాగా, మరో హిందూ దేవాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. పాకిస్థాన్ పంజాబ్ రాస్ట్రంలోని రహీమ్ యూర్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హిందూ దేవాలయంపై దాడి, విధ్వంసం..
భోంగ్ సిటీలోని సిద్ధి వినాయక ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. గుంపులు గుంపులుగా ఆలయంలోకి చొచ్చుకుని పోయి విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఇనుపరాడ్లు, కర్రలు, బండరాళ్లతో హిందూ దేవీదేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయంలోని పవిత్ర గ్రంథాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 100 హిందూ కుటుంబాలను రక్షించేందుకు పాక్ రేంజర్లను ప్రభుత్వం పంపింది. పాలక పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్షాప్కి చెందిన డాక్టర్ రమేష్ కుమార్ వాంక్వానీ.. ఈ విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఈ విధ్వంసాలను వెంటనే ఆపాలని పోలీసులు, అధికారులను కోరారు.
దాడులు ఆపేందుకు ప్రయత్నించని పోలీసులు
పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ స్థానిక పోలీసులు దాడులను ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉదాసీనంగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఇది చాలా సిగ్గు చేటు.. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదని రమేష్ కుమార్ తెలిపారు. పాకిస్థాన్లో మతపరమైన మైనార్టీలను నాన్ సిటిజన్స్గా పరిగణిస్తున్నారని ఆరోపించారు. పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాకిస్థాన్లోని చాలా ప్రాంతాల్లో హిందువులు, క్రైస్తవులు, సిక్కులు తదితర మతాల వారిని ఇలా దేశ పౌరులు కానివారిగా చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాకిస్థాన్ ఏర్పడిన నాటి నుంచి ఆ దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నా, బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నా పాక్ ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
ఆలయం ధ్వంసం: అరెస్ట్ లేదు, కేసూ లేదు..
కాగా, కొద్ది రోజుల క్రితం తలెత్తిన వివాదం తీవ్రమవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయని, ఈ క్రమంలోనే ఆలయంపై దాడి జరిగినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆలయంపై దాడులు జరుగుతున్న సమాచారం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, ఇక్కడి హిందూ కుటుంబాలకు రక్షణ కల్పించామని తెలిపారు. అయితే, ఈ విధ్వంసానికి సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని, కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులు చెప్పడం గమనార్హం. అంతేగాక, దాడికి పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసు అధికారులు.
Recommended Video
పాక్ వైఖరిపై భారత్ ఆగ్రహం...
హిందూ దేవాలయం కూల్చివేతపై భారత విదేశాంగ శాఖ.. పాకిస్థాన్ రాయబారికి సమన్లు పంపింది. పాకిస్థాన్లోని మైనార్టీల మత స్వేచ్ఛపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళనకరమని విదేశాంగ ప్రతినిధి అరందం బాగ్చి వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రభుత్వం విధ్వంసకారులపై చర్యలు తీసుకోకుండా ఉండటంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్లో గత కొంతకాలంగా ప్రముఖ హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా, పాకిస్థాన్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక వందల ఆలయాలు పాక్లో ద్వంసం అయ్యాయి. అయినప్పటికి అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇటీవలే పురాతనమైన ఆలయపునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించిన పాక్ ప్రభుత్వం, ఒత్తిళ్ల కారణంగా వెనక్కితగ్గింది. ఇదిలా ఉంటే, కొన్నినెలల క్రితం ఖబర్ ఫంక్తున్సాలోని వందేళ్లనాటి హిందూ ఆలయం ఒకటి ధ్వంసమైంది. ఈ ఆలయం ద్వంసంపై అప్పట్లో 350 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మార్చినెలలో హిందూ, ముస్లీం పెద్దల మధ్య జిర్గా సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో హిందూ పెద్దలు ఆలయాన్ని ద్వంసం చేసిన ముస్లీంలను క్షమించారని పాక్ హోంశాఖ తెలయజేసింది. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా తెలియజేసినట్టు పాక్ హోంశాఖ పేర్కొనడం గమనార్హం. మరోవైపు, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లోని తన అధికారిక నివాస భవనాన్ని ఇప్పుడు విందు వినోదాలు, వివిధ విద్యా, సాంస్కృతిక, ఫ్యాషన్ ప్రదర్శనలకు అద్దెకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ రకంగా వచ్చే డబ్బు కొంతలో కొంతయినా ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలను తగ్గిస్తే అదే పదివేలని భావిస్తున్నారు. కానీ, అధికారిక నివాసాలకు వచ్చే కిరాయి డబ్బులతో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు తీరతాయా అన్నది ప్రశ్నగానే మిగిలింది.ఇమ్రాన్ సారథ్యంలోని పాలక 'పాకిస్తాన్ తెహరీక్-ఎ-ఇన్సాఫ్' (పీటీఐ) సర్కార్ 2019 ఆగస్టులోనే అధికారిక నివాసాన్ని విశ్వవిద్యాలయంగా మార్చాలని భావించింది. అప్పట్లోనే అలాగే, వివిధ రాష్ట్రాల గవర్నర్లు సైతం అధికారిక నివాసాలలో కాకుండా, మామూలు ఇళ్ళలో ఉంటూ ఖర్చు తగ్గిస్తామన్నారు. అధికారిక నివాసాన్ని వదిలేసి, మరో ఇంటికి ఆ ఏడాదే ఆయన మారిపోయారు. పీఎం నివాసాన్ని నిర్వహించడానికి ఏటా రూ. 47 కోట్లు ఖర్చవుతాయి. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ ఆ ఇల్లు ఖాళీ చేస్తే, ఖర్చు కలిసొస్తు్తందన్నది ఆలోచన. అంతకు ముందు 2018 సెప్టెంబర్లోనూ ఇమ్రాన్ ఇలాంటి పనే చేశారు. అంతకు ముందు ప్రధాని నవాజ్ షరీఫ్ పీఎం నివాసంలో పెట్టుకున్న ఎనిమిది పాడిగేదెల్ని రూ. 23 లక్షలకు అమ్మేశారు. గత వారమేమో 61 లగ్జరీ కార్లు అమ్మేసి, రూ. 20 కోట్లు ఆర్జించారు. ఇంకా 102 కార్లు, నాలుగు హెలికాప్టర్లను వేలం వేయాలని ప్లాన్. వీటి వల్ల కలిసొచ్చిన ఖర్చు, చేతికొచ్చిన సొమ్మెంతో కానీ, నెగిటివ్గానో, పాజిటివ్గానో ఇమ్రాన్కు ప్రచారమైతే దక్కింది. ఇవన్నీ పొదుపు చర్యలని పాలకులంటే, వట్టి జిమ్మిక్కులన్నది ప్రతిపక్ష వాదన.కాగా,ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన బని గల నివాసంలో ఉంటున్నారు. అధికారిక కార్యకలాపాల కోసం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని వినియోగిస్తున్నారు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాక్ ఆర్థిక వ్యవస్థ 19 బిలియన్ డాలర్లు పతనమైంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడానికి ఆయన అనేక పొదుపు చర్యలను అమలు చేస్తున్నారు.