రోడ్లు లేని నగరం.. 15 లక్షల కోట్లతో ప్రాజెక్టు.. ఎక్కడంటే.. ఇవీ విశిష్టతలు
ఏ నగరమైనా రోడ్లు కంపల్సరీ.. రోడ్లు లేకుండా.. కార్లు లేకుండా సిటీ ఊహించుకోవడం కష్టమే. కార్లు/ బైకులు ఉంటే పొల్యూషన్ కంపల్సరీ.. కానీ కాలుష్య కాసార బరిలేకుండా ఓ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం భారీగా నగదు వెచ్చిస్తున్నారు. చమురుకు కేరాఫ్ అడ్రస్ అయిన సౌదీ అరేబియా.. ద లైన్ అనే సిటీని నిర్మిస్తోంది. 170 కిలోమీటర్ల పొడవునా ఈ సిటీ ఉంటుంది.
15 లక్షల కోట్ల వ్యయం
సరళరేఖ గీసినట్టుగా ఉండే నగరం కోసం సౌదీ అరేబియా భారీగా వెచ్చించింది. రూ. 15 లక్షల కోట్లతో నిర్మించబోతుంది. రూ.36 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 'నియోమ్' అనే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఒక భాగమే ఈ నగరం కావడం విశేషం. ఇంట్లోంచి బయటకు వస్తే.. స్కూలు, ఆస్పత్రి, సూపర్మార్కెట్.. ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకన లేదా సైకిళ్లపై ఐదు నిమిషాల్లోపు వెళ్లొచ్చు. మరీ ఎక్కువ అయితే 20 నిమిషాల్లో వెళ్లే వీలు ఉంటుంది. రోడ్లు లేకుండా ఎలా వెళ్లాలంటే ఇటలీ నగరాల్లో కనిపించే పియాజ్జాల ద్వారా వెళ్లొచ్చని చెబుతున్నారు.
భూగర్భంలో రోడ్లు
రోడ్లు లేకుండా, వాహనాలు లేకుండా ఈ నగరానికి అవసరమైన నిత్యావసరాలు ఎలా వస్తాయనే సందేహం వస్తోంది. రోడ్లు నగరం కింద.. భూగర్భంలో ఉంటాయి. రెండు పొరల్లో ఏర్పాటు చేస్తారు. మొదటి పొరను సర్వీస్ లేయర్ కాగా.. సరుకు రవాణా లారీల వంటివి లేయర్లో ప్రయాణిస్తాయి. దాని కింద స్పైన్ లేయర్ ఉంటుంది. ద లైన్లో ఒక చోటు నుంచి మరొ చోటుకు అత్యంత వేగంగా ప్రయాణించడానికి రవాణా వ్యవస్థ ఆ లేయర్లో ఉంటుంది.
పదేళ్లలో 3.80 లక్షల ఉద్యోగాలు
2030 నాటికి 3 లక్షల 80 వేల ఉద్యోగాలు సృష్టించి, స్థూలజాతీయోత్పత్తికి తన వాటాగా రూ.3.5 లక్షల కోట్లు అందించేటట్టు నగరాన్ని నిర్మించబోతున్నారు. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడి ఉంది. పెరుగుతున్న భూతాపం, స్వచ్ఛ ఇంధనాలపై పెరుగుతున్న అవగాహన వంటివాటి నేపథ్యంలో భవిష్యత్తులో ఆ ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది.
Recommended Video
ఎందుకంటే..
ఆదాయం కోసం చమురుపై ఆధారపడకుండా ఇలాంటి పర్యాటక ఆకర్షణల వైపు వెళ్లాలని భావిస్తున్నారు. సౌర, పవన విద్యుత్, హైడ్రోజన్ ఆధారిత రవాణా వ్యవస్థ వైపునకు మళ్లాలని సౌదీ భావిస్తోంది. అందుకు నాందీ నియోమ్ నగరం. ప్రజలను రక్షించుకోవడానికి నగరాలను నిర్మించేవారని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. పారిశ్రామిక విప్లవం తర్వాత నగరాల్లో ప్రజలకన్నా కార్లు, ఫ్యాక్టరీలు, యంత్రాలకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. 2050 నాటికి.. ప్రయాణ సమయాలు రెట్టింపు అవుతాయని చెప్పారు. జీవితంలో ఏళ్ల తరబడి ఇలా ప్రయాణాలకు ఎందుకు వృథా చేయాలని..సంప్రదాయ నగరమనే భావననే.. భవిష్యత్తు నగరంగా మార్చేయాల్సిన అవసరముందన్నారు. అందుకోసమే ద లైన్ నగరాన్ని నిర్మించబోతున్నామని వివరించారు.