పతనం అంచుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం: ఇమ్రాన్ ఖాన్ రాజీనామా తప్పదా?: క్యాంప్ రాజకీయాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయడం తప్పకపోవచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. ఈ పరిణామాల మధ్య ఆయన కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీలపై నిఘా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సింధ్ ప్రావిన్స్కు వారిని తరలించాలని సూచించారు.

రాజీనామా తప్పదా?
మిత్ర పక్షాలకు చెందిన సభ్యుల రాజీనామాతో పాకిస్తాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటోంది. ఈ నెల 27వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఆ దేశ పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి లేదు. ముందు నుంచీ మిత్రపక్షాల మద్దతుతోనే ఆయన నెట్టుకొస్తోన్నారు. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో మిత్రపక్షాలు సంకీర్ణ కూటమి నుంచి తప్పుకోవడం వల్ల మైనారిటీలో పడినట్టే కనిపిస్తోంది.

మైనారిటీలో పడినట్టే..
342 మంది సభ్యుల బలం ఉన్న పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 172. 2018 నాటి ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి దక్కినవి 155 స్థానాలే. దీనితో ఆయన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇతర పక్షాలతో మద్దతును తీసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహా ఇతర మిత్ర పక్షాల సభ్యులు తమ మద్దతును ఉపసంహరించుకుంటోన్నాయి. రాజీనామాల బాట పట్టాయి. దీనితో ప్రభుత్వం మైనారిటీలో పడింది. రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

సొంత పార్టీ సభ్యులు సైతం..
ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా మంత్రులు సైతం రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. ఇందులో సొంత పార్టీకి చెందిన ఎంపీలు సైతం ఉన్నారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటూ అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో తమ పార్టీ సభ్యులను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. సింధ్ ప్రావిన్స్కు తరలించారు. వారిపై నిఘా ఉంచాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.

వ్యతిరేకత రావడానికి..
సంకీర్ణ ప్రభుత్వం నడపించడానికి అవసరమైన లౌక్యం ఆయనలో కొరవడిందని, అందుకే ఈ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పాకిస్తాన్ చరిత్రలోనే మొదటిసారిగా ఇద్దరు హిందువులను పాకిస్తాన్ మిలటరీలో లెప్టినెంట్ కల్నల్గా ప్రమోట్ చేయడం చాలామందికి నచ్చట్లేదని చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయించడం, వారిని జైలుపాలు చేయడం కూడా రాజకీయంగా వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైందని అంటున్నారు.

25న లాంగ్మార్చ్..
ఫలితంగా ప్రధాన ప్రతిపక్షాలు ఏకం అయ్యాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ పరిణామాలతో ఇమ్రాన్ ఖాన్.. ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తోన్నారు. బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు. ఈ నెల 25వ తేదీన లాంగ్మార్చ్ను నిర్వహించనున్నారు. తన హయాంలో పాకిస్తాన్లో చోటు చేసుకున్న మార్పులను గుర్తించాలంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తోన్నారు. మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులే తలెత్తితే- తాము సిద్ధంగా ఉన్నామనీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications