కిమ్ జాంగ్ ఉన్ను ఇలా చంపేసేందుకు అమెరికా ప్లాన్, కానీ!
వాషింగ్టన్: తమ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ను హత్య చేయాలని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ, దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సర్వీసెస్లు సంయుక్తంగా కుట్ర పన్నాయని ఉత్తర కొరియా ఆరోపించింది.
ఓ జీవ రసాయన ఆయుధాన్ని ప్రయోగించడం ద్వారా కిమ్ను హత్య చేయాలన్నది వారి పన్నాగమని, అది ఎప్పటికీ విజయవంతం కాదని, వారి ప్రయత్నం కలగా మిగిలిపోతుందని చెప్పింది.
గత కొంత కాలంగా ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తుండగా, తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగేలా అమెరికా ప్రయత్నిస్తే, అణ్వస్త్రాల ప్రయోగానికి వెనుకాడబోమని ఉత్తర కొరియా హెచ్చరించింది.
కిమ్ను చంపేసే కుట్ర
దక్షిణ కొరియాతో కలసి అమెరికా హద్దులు దాటుతోందని, ఈ రెండు దేశాలూ ప్రపంచానికి భూతాలుగా పరిణమించాయని ఉత్తర కొరియా రక్షణ శాఖ ఓ ప్రకటనలో ఆరోపించింది.
సీఐఏతో కలసి దక్షిణ కొరియా వేసిన ప్రణాళికను తాము ఇటీవలే గుర్తించామని, సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో ఇటీవల దక్షిణ కొరియాను సందర్శించినప్పుడు ఈ ప్లాన్ వేశారని పేర్కొంది.
అణ్వస్త్ర ప్రయోగానికి సిద్ధమైతే..
ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా మరో అణ్వస్త్ర ప్రయోగానికి సిద్దమైతే సరిహద్దు ప్రాంతలో వేలాదిమంది అమాయక ప్రజలు మరణిస్తారని చైనా ఆందోళన వ్యక్తం చేసింది.
అగ్నిపర్వతం బద్దలు
నేరుగా అణ్వస్త్ర ప్రయోగం వల్ల కాకుండా ఆ ప్రయోగం కారణంగా కొరియా, చైనా సరిహద్దుల్లోని మౌంట్ పేంక్తూ అగ్నిపర్వతం బద్దలవడం వల్ల వేలాది మంది ప్రజలు మరణిస్తారని రాండ్ కార్పోరేషన్కు చెందిన డిఫెన్స్ విశ్లేషకులు చెప్పారు. ఈ అగ్ని పర్వతాన్ని చైనా భాషలో చాంగ్ బైషాన్ అంటారు.
లక్షలాది మంది ప్రజలు
ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించే పుంగీ రీ ప్రాంతానికి కేవలం 130 కి.మీ. దూరంలో ఈ అగ్ని పర్వతం ఉంది. దానికి వంద కిలోమీటర్ల పరిధిలో ఇరు దేశాలకు చెందిన దాదాపు పదహారు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.
ప్రస్తుతం ప్రమాదం ఏ స్థాయిలో ఉందో చెప్పలేని స్థితి
అగ్ని పర్వతం బద్దలయితే ఇరు దేశాల ప్రజల ప్రాణాలకు ముప్పు అని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఉ.కొరియా చాలాకాలం నుంచి ప్రపంచ దేశాలను దూరంగా ఉంచడం వల్ల అగ్ని పర్వతం నుంచి ముప్పు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి అంటున్నారు.
మరోవైపు, చైనాకు ఉ.కొరియా కూడా ధీటుగా సమాధానం చెప్పింది. వారి హద్దుల్లో వారు ఉండాలని, లేదంటే మిత్రదేశం అని కూడా చూడమని హెచ్చరించింది.