ఉత్తర కొరియా ‘ఖతర్నాక్ ప్లాన్’! జపాన్ మీదుగా గువామ్ దీవిపైకి.. హాసంగ్-12 మిస్సైళ్లతో దాడి!!
అమెరికాపై దాడికి ఉత్తరకొరియా ఖతర్నాక్ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ను ఎలా అమలు చేయాలన్న దానిపై ప్రస్తుతం తీవ్ర కసరత్తు చేస్తోంది.
ప్యోంగ్యాంగ్: అగ్రరాజ్యం అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఉత్తరకొరియా లోలోపల అత్యంత రహస్యంగా తన పని తాను చేసుకుపోతోంది. పసిఫిక్ సముద్రంలో ఉన్న అమెరికా దీవి గువామ్ టార్గెట్ గా చేసుకుని తన సత్తా ఏమిటో అమెరికాకు స్పష్టం చేయాలని భావిస్తోంది.
అమెరికా, ఉత్తర కొరియా మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని చిన్న దేశమైన ఉత్తరకొరియా ఏం చేయలేదనే ధీమాతో ఉన్న ట్రంప్ కు షాక్ ఇచ్చేలా తన చర్య ఉండాలని ఉత్తరకొరియా భావిస్తోంది. దీనికోసం పెద్ద ప్లానే వేసింది.
4 హాసంగ్-12 క్షిపణులతో దాడి...
అమెరికాపై దాడికి ఉత్తరకొరియా ఖతర్నాక్ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ను ఎలా అమలు చేయాలన్న దానిపై ప్రస్తుతం తీవ్ర కసరత్తు చేస్తోంది. అమెరికా దీవి గువామ్ పై నాలుగు హాసంగ్-12 క్షిపణులను ప్రయోగించాలనేది ఉత్తరకొరియా ప్లాన్ గా తెలుస్తోంది. వాటిని జపాన్ సముద్ర జలాల మీదుగా ప్రయోగించేందుకు ఉత్తర కొరియా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Recommended Video
వారం రోజుల్లో ఫైనల్ ప్లాన్...
గువామ్ దీవిపై మిస్సైళ్ల దాడికి సంబంధించి ఉత్తరకొరియా కమాండర్ తుది ప్లాన్ రచిస్తున్నట్లు సమాచారం. అన్నీ సవ్యంగా జరిగితే.. మరో వారం రోజుల్లోగా ఫైనల్ ప్లాన్ రెడీ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్ కు దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఉత్తరకొరియా మిలిటరీ దాడికి దిగుతుందట.
వాటికి అంత శక్తి ఉందా?
గువామ్ దీవిపై దాడికి ఉత్తరకొరియా సిద్ధం చేస్తున్న హాసంగ్-12 మిస్సైళ్లకు నిజంగా అంతటి శక్తి ఉందా? అనే విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. వాటికి అంత శక్తి లేదని, ఒకవేళ ఉత్తర కొరియా వాటిని ప్రయోగించినా అవి గువామ్ దీవికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర జలాల్లో పడతాయని అమెరికా యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అసలు ఉత్తర కొరియా ఈ మిస్సైళ్లను వదులుతుందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కిమ్ ‘ఊ’ అంటే చాలు.. మిస్సైళ్ల వర్షమే...
ఉత్తర కొరియా ఆర్మీ కమాండర్ వేసిన ప్లాన్ ప్రకారం హాసంగ్-12 రాకెట్లు జపాన్లోని షిమేన్, హిరోషిమా, కోయిచి ప్రాంతాల మీదగా గువామ్ దీవి వైపు వెళ్లనున్నాయి. ఆ మిస్సైళ్లు జపాన్ తీరం దాటిన తర్వాత సుమారు 1065 సెకన్లు ప్రయాణిస్తాయట. ఈనెల మధ్యలోనే ఈ దాడికి సంబంధించిన ప్లాన్కు ఆమోదం లభిస్తుందని ఉత్తర కొరియా మిలిటరీ భావిస్తోంది. ఆ దేశాధినేత కిమ్ ఆదేశం ఇవ్వడమే ఆలస్యం.. అమెరికా జలాల్లో హాసంగ్ -12 మిసైళ్ల వర్షం కురుస్తుందట.
కచ్చితంగా టార్గెట్ ను చేరుకోగలదు...
అయితే ఉత్తర కొరియా నుంచి గువామ్ దీవి సుమారు 3400 కిలోమీటర్లు ఉంటుంది. మరి అంత దూరాన్ని ఈ హాసంగ్-12 మిస్సైళ్లు చేరుకోగలుగుతాయా? ఈ సందేహం ఇప్పుడు అందరిని తొలిచివేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఉత్తరకొరియా మిలిటరీ పరేడ్లో కూడా హాసంగ్-12 మిస్సైళ్లను ప్రదర్శించారు. ఇది ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ మిస్పైల్. హాసంగ్ క్షిపణి సుమారు 3700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని ఉత్తరకొరియా మిలిటరీ చెబుతోంది. ఇది నిజమే గనుక అయితే ఉత్తరకొరియా ప్రయోగించే ఈ మిస్సైళ్లు గువామ్ దీవిని కచ్చితంగా చేరుకోగలవు.
అమెరికా కూడా పసిగట్టని విధంగా...
మరోవైపు ఉత్తర కొరియా తన ఈ మిస్సైళ్ల దాడిని అమెరికా కూడా గుర్తించలేని విధంగా చర్యలు తీసుకుంటోంది. హాసంగ్-12 మిస్సైళ్లను మొబైల్ లాంచర్లతో ఫైర్ చేస్తారట. దాని వల్ల వీటిని నేలపై ధ్వంసం చేయడం అంత సులువు కాదు. ఒకేసారి నాలుగు మిస్సైళ్లను ప్రయోగించడం వల్ల అమెరికా మిలిటరీ వాటిని పసికట్టలేదని, ఈలోగానే అవి గువామ్ దీవిని చేరతాయనేది ఉత్తరకొరియా ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు ఉత్తరకొరియాకు అంత సీన్ లేదని, దానివన్నీ తాటాకు చప్పుళ్లేనని ప్రకటనలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉత్తరకొరియా దూకుడును ఎలా అడ్డుకుంటారో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.