కీలక ప్రతిజ్ఞ చేసిన ఆధునిక నియంత కిమ్జొంగ్..!!
సియోల్: అణ్వాయుధాల పరీక్షల్లో ఉత్తర కొరియా వెనక్కి తగ్గట్లేదు. తన మిలటరీ సత్తాను మరోసారి నిరూపించుకుంది. మరో ప్రయోగానికీ పూనుకుంది. ఇంటర్ కాంటినెంటల్ బాల్లిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎం) ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఆధునిక నియంతగా గుర్తింపు పొందిన ఆ దేశాధినేత కిమ్జొంగ్ ఉన్.. స్వయంగా దీన్ని పర్యవేక్షించారు. ఆయన కనుసన్నల్లో సాగిందీ టెస్ట్ ఫైర్. తన భార్య, కుమార్తెతో కలిసి ఈ ఖండాంతర బాల్లిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
69 నిమిషాల్లో..
తాజాగా ప్రయోగించిన ఖండాంతర బాల్లిస్టిక్ క్షిపణి 69 నిమిషాల వ్యవధిలో 1,000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. ఒకక దశలో ఈ క్షిపణి గరిష్ఠ వేగం ఆల్టిట్యూడ్ 6,041 కిలోమీటర్లు. ఈ మిస్సైల్కు హ్వాసాంగ్ - 17గా పేరు పెట్టినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీన్ని ఒక మాన్స్టర్ మిస్సైల్గా అభివర్ణించింది. బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. 15,000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించగలదని పేర్కొంది. ఇప్పటివరకు ప్రయోగించిన క్షిపణుల కంటే దీనికి కిమ్ జొంగ్ చాలా ప్రాధాన్యత ఇస్తోన్నారని, అందుకే తన భార్య, కుమార్తెతో కలసి దీన్ని వీక్షించారని వివరించింది.
అవలీలగా క్షిపణి పరీక్షలు..
అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలతో సరికొత్త ప్రయోగాలను చేయడం కిమ్ జొంగ్కు కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు మిస్సైళ్లను పరీక్షించారు. అరుదుగా చెప్పుకొనే అణ్వాయుధ టెస్ట్ ఫైర్ను ఆయన అవలీలగా సాగిస్తోన్నారు. అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ.. దాన్ని లెక్కచేయట్లేదు. పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు కిమ్జొంగ్. ఆ రెండు దేశాల సముద్ర జలాల్లోకి తరచూ బాల్లిస్టిక్ మిస్సైళ్లను సంధిస్తోన్నారు.
తిరుగులేని దేశంగా..
ఇటీవలే ఉత్తర కొరియా తన అణు చట్టాలను సవరించుకుంది. అణ్వాయుధ సంపత్తిలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించేలా చట్టాలను పునఃసమీక్షించుకుంది. ఈ సెగ్మెంట్లో తిరుగులేని అణుశక్తిగా ఉత్తర కొరియా ఆవిర్భవించనున్నట్లు ప్రకటించుకుంది. దీని తరువాత క్షిపణి పరీక్షలు మరింత ముమ్మరం చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సైనిక విన్యాసాల్లో 150 కంటే ఎక్కువ యుద్ధ విమానాలను వినియోగించినట్లు కేసీఎన్ఏ స్పష్టం చేసింది.
అణ్వాయుధాలతో సమాధానం ఇస్తాం..
ఈ పరీక్షల అనంతరం అధ్యక్ష కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. హ్వాసాంగ్ 17 ప్రయోగం విజయవంతమైన అనంతరం కిమ్జొంగ్ చేసిన వ్యాఖ్యలను అందులో పొందుపరిచింది. అమెరికా గానీ ఇతర ఏ దేశమైనా తమను ప్రశ్నించినా, బెదిరింపులకు దిగినా అణ్వాయుధాలతోనే సమాధానం ఇస్తామని తేల్చి చెప్పారు కిమ్ జొంగ్. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పూర్తిస్థాయి యుద్ధాన్ని ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ అన్నారు.
దక్షిణ కొరియా ఆందోళన..
ఈ ప్రయోగాన్ని పొరుగునే ఉన్న దక్షిణ కొరియా ధృవీకరించింది. రాజధాని సియోల్లో ఆ దేశ సైన్యాధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉత్తర కొరియా తూర్పు సముద్ర తీరం నుంచి ఈ పరీక్ష సాగినట్లు తెలిపారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నామనీ స్పష్టం వివరించారు. అణ్వాయుధ పరీక్షలు, ప్రయోగాలను నిరోధించడానికి అమెరికా చేస్తోన్న ప్రయత్నాలకు విరుద్ధంగా ఉత్తర కొరియా వ్యవహరిస్తోందని మండిపడింది.