అరుణాచల్ప్రదేశ్పై చైనా దురంహకార వ్యాఖ్యలు
బీజింగ్: చైనా మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం కిందికి వస్తుందంటూ వితండవాదం చేస్తోన్న ఆ దేశం ఇప్పుడు ఏకంగా తాము అసలు అరుణాచల్ ప్రదేశ్ ఉనికినే గుర్తించలేదంటూ దురహంకార వ్యాఖ్యలు చేసింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్జువాంగ్ ఈ వ్యాఖ్యలతో తాజా వివాదానికి తెరతీశారు.
కాగా, చైనా భద్రతా సిబ్బంది అరుణాచల్ప్రదేశ్లోకి 200 మీటర్లు చొచ్చుకొని వచ్చి సియాంగ్ జిల్లా వరకు చేరుకున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. గత నెల చైనా దళాలు నిర్మాణ రంగానికి సంబంధించిన సామగ్రిని తీసుకుని ఆ రాష్ట్రానికి చేరుకున్నాయి. మన భద్రతా దళాలు నిలువరించడంతో వెనక్కి వెళ్లిపోయాయని కథనాలు వచ్చాయి.
డిసెంబర్ నెల న్యూదిల్లీలో రెండు దేశాల భద్రతా సలహాదారులు సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ చొరబాటు గురించి జెంగ్ మాట్లాడుతూ.. 'రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ 3,488 కిలోమీటర్ల మేర ఉంది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య మంచి అవగాహన ఉంది. అయినా మీరంటున్న విషయం గురించి అసలు నేను విననే లేదు' అని తెలిపారు.
ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్లో భాగమేనని చైనా వాదిస్తోంది. ' రెండు దేశాల సరిహద్దులో సఖ్యత నెలకొల్పడానికి కలిసి పనిచేయాలి' అని డిసెంబరు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డోక్లాం గురించి ప్రశ్నించగా 'అది గత సంవత్సరం జరిగిన వ్యవహారమని, రెండు దేశాలు పరస్పరం చర్చించుకుని సమస్యనుసానుకూలంగా పరిష్కరించుకున్నాయి' అని చెప్పారు.