మీకు తెలియంది కాదు: భారత్కు తాలిబన్ల తీవ్ర హెచ్చరిక, ఆఫ్ఘాన్లో కాలుమోపితే అంతే సంగతులు
న్యూఢిల్లీ/కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న తాలిబన్లు.. మరో వారంలో దేశ రాజధాని కాబూల్ను తమ వశం చేసుకుంటామని ప్రకటించారు. అయితే, తాలిబన్ల దురాక్రమణల వెనుక పాకిస్థాన్, చైనాలు ఉండటంతో భారత్కు ఇది ఆందోళనకర విషయంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రతినిధులు తాలిబన్లతో చర్చ జరిపారు. అయితే, తాలిబన్ల నుంచి భారత్ ఆశించిన సమాధానం రాలేదని తెలుస్తోంది.
తాలిబన్లతో భారత్ సమావేశం..
ఈ సమావేశాల అనంతరం ఓ తాలిబన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. తాము ఆఫ్ఘనిస్థాన్లోని ఇతర దేశాలకు చెందిన దౌత్య, రాయబార కార్యాలయాలపై దాడులు చేయమని, ఇతరులకు హాని కలిగించమని తెలిపారు. అయితే, ఈ సందర్భంగా ఓ తీవ్ర హెచ్చరిక కూడా చేశారు. 'భారత ప్రతినిధులు తమ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సమాచారం ఉంది. అయితే, నేను దాన్ని ధృవీకరించలేను. దోహాలో ఎలాంటి ప్రత్యేక సమావేశం జరగలేదు. అయితే, దోహాలో తాము జరిపిన సమావేశంలో భారత ప్రతినిధులు పాల్గొన్నారు' అని తాలిబన్ అధికార ప్రతినిధి ముహమ్మద్ సుహేల్ షాహీన్ మీడియాకు తెలిపారు.
తేల్చి చెప్పిన భారత్.. తాలిబన్లు ఏమన్నారంటే..?
ఖతార్ తోపాటు మరికొన్ని దేశాలతో జరిగిన సమావేశాల్లో భారత్ పాల్గొంది. ఆఫ్ఘనిస్థాన్ను ఎలాంటి మిలిటరీ దురాక్రమణను స్వాగతించమని స్పష్టం చేసింది. అంతేగాక, ఆఫ్గాన్లో సాయుధ బలగాలు వెంటనే కాల్పులు విరమించాలని, శాంతికి సహకరించాలని సూచించింది. ఆగస్టు 10 జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని పాకిస్థాన్, చైనాలు కూడా పేర్కొన్నాయని ఖతార్ వెల్లడించింది. ఆఫ్ఘానిస్థాన్ భూమిని తాము ఏ దేశానికీ(పొరుగుదేశాలు కూడా) వ్యతిరేకంగా ఉపయోగించుకోమని, అలా ఎవరైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని తాలిబన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్కు వ్యతిరేకంగా ఆఫ్ఘానిస్థాన్ను ఉపయోగించుకుంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఆఫ్ఘాన్లో ప్రధాన నగరాలన్నీ తాలిబన్ల ఆధీనంలోకి..
కాగా, ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్లో చాలా రాష్ట్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. వారం రోజుల్లోగా దేశ రాజధాని కాబూల్ కూడా తమ వశమవుతుందని ప్రకటించారు. ఇదే సమయంలో భారత్ ఆ దేశంలో చేపట్టిన పలు ప్రతిష్టాత్మక నిర్మాణాలపైనా తాలిబన్లు పట్టు సాధించాయి. ఇండియా-ఆఫ్గాన్ స్నేహానికి గుర్తయిన సల్మా డ్యాంను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2016లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆఫ్ఘాన్ ప్రధాని అష్రఫ్ ఘనీలు ప్రారంభించారు. ఆఫ్గాన్లో మూడో అతిపెద్ద నగరమైన హెరాత్ కూడా తాలిబన్ల వశమైంది. మా వైపు నుంచి ఇతర దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలకు, దౌత్యవేత్తలకు ఎలాంటి ప్రమాదం జరగదు. మేము ఏ రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయం. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాం. అదే మా కమిట్మెంట్ అని తాలిబన్ల సదరు అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
మీ మిలిటరీ ప్రవేశిస్తే.. భారత్కు తాలిబన్ల తీవ్ర హెచ్చరిక
అయితే, సదరు తాలిబన్ అధికార ప్రతినిధి మరో హెచ్చరిక కూడా చేశారు. ఆఫ్ఘానిస్థాన్లో భారత సైనికులు ప్రవేశిస్తే మాత్రం.. అది వారికి మంచిది కాదని హెచ్చరించారు. ఇతర దేశాలకు చెందిన మిలిటరీ వచ్చి ఏం సాధించారో, ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారో తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. పక్తియాలోని చంకాని ప్రాంతంలోని ఓ గురుద్వారా పైనున్న నిషాన్ సాహెబ్ జెండాను తొలగించినట్లు వస్తున్న వార్తలను తాలిబన్ అధికార ప్రతినిధి ఖండించారు. అలాంటిదేమీ జరగలేదన్నారు. స్థానిక సిక్కులే ఆ జెండాను తొలగించారని చెప్పుకొచ్చారు. ఆ జెండాను చూస్తే తమవాళ్లు వారిని వేధిస్తారని భావించి తొలగించారని, తాము అక్కడికి వెళ్లి భరోసా కల్పించడంతో తిరిగి జెండాను ఎగురవేశారని సాహీన్ తెలిపారు. పాకిస్థాన్కు ఉగ్రవాద సంస్థలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని షాహీన్ తేల్చిచెప్పారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలేనని కొట్టిపారేశారు.
అమెరికా నిర్లక్ష్యం తాలిబన్లకు వరం.. అసమర్థ స్థితిలో ఆఫ్గాన్ భద్రతా దళాలు
ఇది ఇలావుంటే, అమెరికా దళాలు ఆఫ్ఘాన్ను వదిలి వెళుతున్న సమయంలో భారీగా ఆయుధ డంపులను అక్కడే వదిలేసింది. ఇప్పుడీ ఆయుధాలే తాలిబన్లకు వరంగా మారాయి. సుల్తాన్ ఖిల్ సైనిక స్థావరంలోని కంటైనర్ల కొద్దీ ఆయుధాలు, వాహనాలు తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కుందూజ్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇండియా కానుకగా ఇచ్చిన ఎంఐ హెలికాప్టర్ తోపాటు, అమెరికా స్కాన్ ఈగిల్ డ్రోన్లు సైతం తాలిబన్ల చేతికి చిక్కాయి. ప్రభుత్వానికి ఆదాయం అందకుండా కీలక చెక్ పోస్టులపై తాలిబన్లు పట్టు సాధించారు. తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ సరిహద్దు జిల్లాలు వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఇరాన్ వైపు ఉండే ఇస్లాం డ్రైపోర్ట్, పాక్కు సమీపంలోని స్పిన్ బౌల్డక్ పోస్టులనూ తాలిబన్లు కైవసం చేసుకున్నారు. ఆఫ్గాన్ భద్రత దళాలు తాలిబన్లను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. అవినీతి అక్రమాలు. మాదక ద్రవ్యాల వినియోగం, మరికొందరు దురాక్రమణదారులకు కొమ్ముకాయడంతో ఆఫ్ఘాన్పై తాలిబన్లు పైచేయి సాధించారు. చివరకు ఆఫ్ఘాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ.. తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే, దీనికి తాలిబన్ల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వారంలో రోజుల్లో ఆఫ్గాన్ దేశం తమ ఆధీనంలోకి వస్తుందని తాలిబన్లు ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, తాలిబన్ల దాడుల్లో అనేకమంది మహిళలు, చిన్నారులు మృతి చెందుతుండటం పట్ల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులపై దాడులు ఆపాలని సూచించింది. మహిళలపై విధిస్తున్న కఠినమైన ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేసింది. ఇటీవల ఓ మహిళ ఒంటరిగా బయటికి వచ్చిందని ఆమెను దారుణంగా హత్య చేశారు తాలిబన్లు. మగ తోడు లేకుండా బయటికి వచ్చే మహిళలకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. మతాచారాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు.