ముదురుతోంది: ట్రంప్కు అంత సీన్ లేదు... సమాధానం ఇవ్వాల్సిన పనిలేదన్న ఇరాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సందేశాన్ని ఇరాన్ అధినేత హసన్ రౌహానీకి చేరవేశారు జపాన్ ప్రధాని షింజో అబే. అయితే ట్రంప్కు తిరిగి సమాధానం ఇవ్వాల్సినంత గౌరవం ఆయన ఉంచుకోలేదన్నారు హసన్ రౌహానీ. ఇరాన్ అధినేత వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఓమన్లోని ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే శాంతి చర్చల కోసం జపాన్ రంగంలోకి దిగింది. ఇరాన్పై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే బాధ్యత జపాన్ తీసుకుంది.
జపాన్ ఆయిల్ ట్యాకర్ పై దాడి దేనికి సంకేతం..?
గల్ఫ్ ఆఫ్ ఓమన్లో ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా చేసిన దాడిలో ఒకటి జపాన్కు సంబంధించినదని జపాన్ ప్రధాని ఇరాన్లో పర్యటిస్తున్న సమయంలో జపాన్ ఆయిల్ ట్యాంకర్పై దాడి చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఇరాన్ విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ట్వీట్ చేశారు. జపాన్ ప్రధాని షింజో అబే ఇరాన్కు వెళ్లి చర్చలు జరపడాన్ని తాను అభినందిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్తో ఒక ఒప్పందం అమెరికా ఇప్పుడే చేసుకుంటుందనేది వాస్తవం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని అదే సమయంలో అమెరికా కూడా సిద్ధంగా లేదని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఆంక్షలు విధించినప్పటికీ అత్యధిక చమురు కొనుగోలు చేసిన జపాన్
ఇరాన్ నుంచి చమురు కొనరాదని ప్రపంచ దేశాలపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ... గత నెలలో ఇరాన్ నుంచి అత్యధిక యూనిట్ల చమురును కొన్న దేశంగా జపాన్ నిలిచింది. ఇరాన్ పరిస్థితిపై గత నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చలు జరిపిన జపాన్ ప్రధాని షింజో అబే... ట్రంప్ పంపిన సందేశాన్ని ఇరాన్ అధినేతకు చేరవేశారు. అయితే ట్రంప్ సందేశంపై ఇరాన్ సుప్రీం ఖమేనీ పెద్దగా పట్టించుకోలేదు. ఇక అమెరికాకు తిరిగి సమాధానం ఇవ్వాల్సినంత గౌరవంను ట్రంప్ నిలుపుకోలేదని అతనితో ఇప్పుడు కానీ ..భవిష్యత్తులో కానీ చెప్పాల్సిందేమీ లేదని ఖమేనీ జపాన్ ప్రధాని షింజో అబేతో చెప్పినట్లు తెలుస్తోంది.
అమెరికా-ఇరాన్ల మధ్య మాటల యుద్ధంతో ఎవరికి నష్టం..?
ఇప్పటికే చమురుపై ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం భవిష్యత్తులో రణరంగంగా మారి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఐరోపా, ఆసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలానే కొనసాగితే మధ్యప్రాచ్య దేశాలు చాలా నష్టపోతాయని జపాన్ ప్రధాని షింజో అబే హెచ్చరించారు. ఇరాన్ చేపట్టిన అణుపరీక్షలపై కన్నెర్ర చేసిన అమెరికా ఆ తర్వాత ఇరాన్ దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తున్న మిత్రదేశాలను చమురు కొనరాదని హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో ఇరాన్పై ఆంక్షలు విధించింది. ఆంక్షలు ఎత్తివేయాలంటే ఇరాన్ వెంటనే అణుపరీక్షలను నిలిపివేయాలని హెచ్చరించింది. ఇక ఇరాన్ అమెరికా వార్నింగ్ను పెడచెవిన పెట్టడంతో అమెరికా ఇరాన్ చమురు ప్రాంతాలపై దాడులు చేసేందుకు పెద్ద ఎత్తున్న బలగాలను దింపింది.
మొత్తానికి రెండు దేశాల మధ్య శాంతి నెలకొనకపోతే మధ్యప్రాచ్య దేశాలు నష్టపోక తప్పదు. ఇప్పటికే అమెరికా తన మిత్రదేశాలపై పలు ఆంక్షలు విధించడంతో చమురు కొనుగోలుకు కొన్ని దేశాలు ముందుకు రావడం లేదు. దీంతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా కాస్త ఇబ్బందికరంగా మారుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇతర దేశాలను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ అమెరికాలు వెంటనే శాంతి చర్చలకు ఉపక్రమించాలని వేడుకుంటున్నాయి.