ప్రతీ ఐదుగురిలో ఒకరు.. కరోనా రిస్క్ వాళ్లలో ఎక్కువ... అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఐదుగురిలో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కరోనా వైరస్ బారినపడితే... వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని తేలింది. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.7బిలియన్ల మంది టైప్-2 డయాబెటీస్ లేదా హృద్రోగంతో బాధపడుతున్నారు. ఒకవేళ వీరు వైరస్ బారినపడితే.. ఇందులో 349 మిలియన్ల మందికి కచ్చితంగా ఆస్పత్రి ట్రీట్మెంట్ అవసరమవుతుందని తెలిపారు. లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ఈ అధ్యయనం తాలూకు వివరాలను వెల్లడించారు.
ఆఫ్రికాపై ప్రభావం తక్కువ..
ప్రపంచవ్యాప్తంగా 1.7బిలియన్ల జనాభా డయాబెటీస్,గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని... ఒకవేళ వీరికి వైరస్ సోకితే ప్రపంచంలో 20శాతం జనాభా రిస్క్లో పడ్డట్టేనని అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు,డయాబెటీస్తో పాటు ఎపిడెమాలజీ డేటాను పరిశీలించి ఈ అధ్యయనం చేపట్టినట్టు పరిశోధకులు వెల్లడించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నంత మాత్రాన అందరిలోనూ పరిస్థితులు విషమించే అవకాశం ఉండదని తెలిపారు. ఆఫ్రికా లాంటి యువత జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో హెచ్ఐవి,ఎయిడ్స్ వంటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ.. కరోనా తీవ్రత అంతగా లేదని పేర్కొన్నారు.
యూరోప్లో పరిస్థితి ఎలా ఉందంటే..
యూరోప్ దేశాల్లో సగటు వయసు ఎక్కువగా ఉన్పప్పటికీ.. అక్కడ ప్రతీ ముగ్గురిలో ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా బాగానే ఉన్నట్టు అధ్యయనంలో తెలిపారు. అయితే ఫిజీ,మారిషస్ లాంటి డయాబెటీస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో రిస్క్ ఎక్కువ అని పరిశోధకులు వెల్లడించారు.లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్,ట్రోపికల్ మెడిసిన్కు చెందిన నిపుణుల బృందం ఈ అధ్యయనం చేపట్టింది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 81,28,487కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 4,39,421కి చేరింది. 42,42,123 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అమెరికా,బ్రెజిల్,రష్యా,భారత్,బ్రిటన్ మొదటి ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్లో ఇప్పటివరకూ 3,43,091 కేసులు నమోదవగా.. 9915 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ముఖ్యంగా ఢిల్లీ,ముంబై,చెన్నై,అహ్మదాబాద్ నగరాల్లో కేసులు తీవ్రత ఎక్కువగా ఉంది.