ఆఫ్గన్ ప్రజలకు జో బైడెన్ బిగ్ షాక్... అమెరికా వైఖరిపై కుండబద్దలు కొట్టిన అధ్యక్షుడు..
ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిన వేళ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆఫ్గన్ ప్రజలను నిస్సహాయ స్థితిలో వదిలి అమెరికా తమ సైన్యాన్ని అక్కడి నుంచి ఉపసంహరించుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఎట్టకేలకు మౌనం వీడారు. ఆఫ్గన్ పట్ల అమెరికా అవలంభించబోయే వైఖరిపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
'20 ఏళ్ల క్రితం స్పష్టమైన లక్ష్యాలతో మేము ఆఫ్గన్ గడ్డపై అడుగుపెట్టాం. సెప్టెంబర్ 11,2001న అమెరికాపై దాడి చేసిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మరోసారి మాపై దాడి చేసేందుకు ఆఫ్గనిస్తాన్ వేదిక కావొద్దని భావించాం. అనుకున్నట్లుగానే మా లక్ష్యాలను చేరుకున్నాం. అల్ ఖైదా ప్రాబల్యాన్ని తగ్గించేశాం.ఒసామా బిన్ లాడెన్ వేటలో మేమెప్పుడూ వెనక్కి తగ్గలేదు.20 ఏళ్ల క్రితం అతన్ని మట్టుబెట్టాం.' అని జో బైడెన్ పేర్కొన్నారు.
ఒక దేశంగా ఆఫ్గనిస్తాన్ను నిలబెట్టడమో లేక అక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమో అమెరికా మిషన్ కాదన్నారు. ఆఫ్గన్ గడ్డ పైనుంచి అమెరికాపై దాడి జరగకుండా చూసుకోవడమే ఇప్పటికీ తమ ఏకైక జాతీయ ఎజెండాగా చెప్పారు. ఆఫ్గనిస్తాన్లో తిరుగుబాటును అణచివేయడమో లేక ఆ దేశాన్ని నిలబెట్టడమో మా పని కాదు... ఉగ్రవాదాన్ని అణచివేయడంపైనే మా ఫోకస్ ఉంటుందని చాలా ఏళ్లుగా తన వాదన వినిపిస్తున్నట్లు చెప్పారు. తమది కాని యుద్ధంలో అమెరికా సైనికులను కోల్పోదలుచుకోలేదన్నారు. ఆఫ్గన్ కోసం ఇప్పటికే భారీగా డబ్బు ఖర్చు చేశామని... అన్ని విధాలా సహాయ సహకారాలు అందించామని చెప్పారు. అయితే పోరాడాలనే సంకల్పాన్ని మాత్రం ఇవ్వలేకపోయామన్నారు.
'ఉగ్రవాద సంస్థలను ఏరివేయడానికి.. అమెరికాకు శాశ్వత మిలటరీ లేని దేశాల్లో సమర్థవంతంగా కౌంటర్ టెర్రరిజం మిషన్స్ను చేపడుతాం. అవసరమైతే ఆఫ్గనిస్తాన్లోనూ ఇదే చేస్తాం.' అని జో బైడెన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్లో పరిస్థితిని తనతో పాటు నేషనల్ సెక్యూరిటీ టీమ్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. జరుగుతున్న పతనం పట్ల వేగవంతమైన ప్రతిస్పందనకు ముందుకు కదులుతున్నట్లు చెప్పారు.
ఆఫ్గన్ నుంచి సైన్యం ఉపసంహరణను బైడెన్ సమర్థించుకున్నారు. తన నిర్ణయానికి ఇప్పటికీ పూర్తిగా కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆఫ్గన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడానికి ఇక సరైన సమయం అంటూ ఉండదని తాను గ్రహించానన్నారు. సైన్యాన్ని ఉపసంహరించుకుంటే ఎదురయ్యే రిస్క్ పట్ల తమకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అయితే పరిస్థితులు ఇంత త్వరగా దిగజారుతాయని భావించలేదన్నారు. ఆఫ్గన్ నాయకులు చేతులెత్తేసి దేశం విడిచి పెట్టి పారిపోవడం వల్ల మిలటరీ పతనమైందన్నారు.ఏదేమైనా అమెరికా తమ కోసం ఏమైనా చేయకపోదా అని ఎదురుచూస్తున్న ఆఫ్గన్ ప్రజలకు బైడెన్ వ్యాఖ్యలు వారిని మరింత నిరాశలోకి నెట్టేసేలా చేశాయనే చెప్పాలి.
ఆఫ్గనిస్తాన్లో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు రెండు దశాబ్దాల పాటు అక్కడ పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవల అక్కడి నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో తాలిబన్లు మరింత రెచ్చిపోయారు. అడ్డూ అదుపూ లేకుండా క్రమంగా దేశం మొత్తాన్ని ఆక్రమించేశారు. గతేడాది ఖతర్లో తాలిబన్లతో కుదిరిన శాంతి ఒప్పందం మేరకు అమెరికా తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంది. అయితే తాలిబన్ల కపట ఒప్పందం గురించి తెలిసి కూడా అమెరికా అక్కడి నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. యుద్ధం పూర్తి చేయకుండానే... ఆ భారం మొత్తం ఆఫ్ఘన్ ప్రజలపై వేసి వెళ్లిపోవడం సరికాదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఆదివారం(ఆగస్టు 16) తాలిబన్లు కాబూల్ నగరాన్ని ఆక్రమించడంతో ఆఫ్గనిస్తాన్ దురాక్రమణ పూర్తయింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ రాజ్య స్థాపన చేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ ఇక అధికారాన్ని తాలిబన్లకు అప్పగిస్తున్నట్లు ప్రకటించి దేశాన్ని వీడి పారిపోయారు. తాలిబన్ నేత అబ్దుల్ ఘనీ బరాదర్ ఆఫ్గన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
#WATCH | "Our mission in Afghanistan was never supposed to be nation-building or create a unified, centralised democracy. Our only vital national interest in Afghanistan remains today what it has always been preventing terrorist attack on American homeland" says US Pres Joe Biden pic.twitter.com/TqOxrUOtdT
— ANI (@ANI) August 16, 2021