coronavirus ఎఫెక్ట్: మోడీ ప్రతిపాదనకు పాక్ ఓకే, స్వాగతించిన సార్క్ దేశాలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ విషయంలో దాయాది దేశం ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటకు సానుకూలంగా స్పందించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్నీ రూపొందించాలని ప్రధాని మోడీ ప్రతిపాదించారు. దీనికి పాకిస్థాన్ మద్దతు పలికింది.
మోడీ ప్రతిపాదనకు పాక్ ఓకే..
అంతేగాక, సార్క్ దేశాధినేలతో నిర్వహించాలన్న మోడీ ప్రతిపాదిత వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. పాక్ తరపున ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ అసిస్టెంట్ జాఫర్ మీర్జా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారని తెలిపింది. కరోనా వంటి మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉమ్మడి వ్యూహాలు, ప్రణాళికలు ఎంతో దోహదహం చేస్తాయని అభిప్రాయపడింది.
పాక్లో 22 మందికి కరోనా..
ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఐషా ఫరూకీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా, పాకిస్థాన్లో వైరస్ కట్టడి అవగాహన కార్యకలాపాలను జాఫర్ మీర్జా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు పాకిస్థాన్లో 22 మందికి కరోనా సోకింది. వీరిలో ఒకరు కోలుకున్నారు. పాక్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటోంది.
స్వాగతించిన సార్క్ దేశాలు
ఉమ్మడి వ్యూహం ద్వారా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుద్దామని, ఆరోగ్యకరమైన భూగోళానికి దోహదపడదామని మోడీ సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచం కొవిడ్-19తో పోరాడుతోందని, వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా శక్తివంచన లేకుండా పోరాడుతున్నారని చెప్పారు. దక్షిణాసియా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చూడటానికి అన్ని ప్రయత్నాలు చేపట్టాలన్నారు. కాగా, ప్రధాని మోడీ ప్రతిపాదనను ఇప్పటికే సార్క్ దేశాలన్నీ స్వాగతించడం గమనార్హం. ఇది ఇలావుంటే, కరోనాతో భారతదేశంలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా, 83 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.