పాకిస్తాన్పై భారీ దాడి: ప్రాణభయంతో పారిపోతున్న ప్రజలు!
Pakistan vs Afghanistan: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య వివాదం మరోసారి తీవ్రమైంది. సరిహద్దుల్లో ఈ రెండు దేశాల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఇరు దేశాల సైన్యాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడమే కాకుండా మోర్టార్, రాకెట్లను కూడా ప్రయోగించాయి. ఈ ఆకస్మిక ఘర్షణ కారణంగా సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురై రాత్రికి రాత్రే తమ ఇళ్లను వదిలి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.
కాల్పుల విరమణ విఫలం
ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ రాష్ట్రంలో స్పిన్ బోల్దక్ ప్రాంతంలో ఆఫ్ఘన్, పాక్ సైన్యాలు మరోసారి ఘర్షణకు దిగాయి. ఇరు సైన్యాలు సరిహద్దు నుంచి ఒకరిపై ఒకరు గ్రెనేడ్లు, మోర్టార్లను ప్రయోగించాయి. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ కాల్పులు రెండు రోజుల క్రితం జరిగిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత జరగడం గమనార్హం.

పరస్పర ఆరోపణలు
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు పోలీసు ప్రతినిధి అబెదుల్లా ఫారూఖీ ఘర్షణను ధ్రువీకరించి కాల్పులను మొదట పాకిస్తాన్ సైన్యమే ప్రారంభించిందని ఆరోపించారు. అయితే తొలుత ఆఫ్ఘన్ సైన్యమే దాడి చేసిందని, ఆ తర్వాత ఇరువైపుల నుండి కాల్పులు, గ్రెనేడ్లు, రాకెట్లు ప్రయోగించబడ్డాయని పాకిస్తాన్ పేర్కొంది. ఆకస్మికంగా జరిగిన ఈ దాడితో భయపడిన ప్రజలు తమ వస్తువులను తీసుకుని రాత్రికి రాత్రే గ్రామాలను వదిలి పారిపోయారు.
డ్యూరాండ్ రేఖ వద్ద మరో ఘర్షణ
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని డ్యూరాండ్ రేఖ వద్ద కాందహార్ రాష్ట్రం సమీపంలో గత అక్టోబర్ నెలలో కూడా ఇలాంటి ఘర్షణే జరిగింది. డ్యూరాండ్ రేఖపై చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ఈ రేఖను తమ అధికారిక సరిహద్దుగా గుర్తించదు, కానీ పాకిస్తాన్ ప్రభుత్వం దీనిని అధికారిక సరిహద్దుగా ప్రకటించింది. అందుకే ఈ రేఖ గుండా జరిగే ప్రయాణాన్ని ఆఫ్ఘనిస్తాన్ అక్రమ చొరబాటుగా పరిగణిస్తుంది.
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎలా పెరిగాయి?
అక్టోబర్ 8-9: తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఖైబర్ పఖ్తూంఖ్వాలో ఉగ్రదాడి చేయగా.. పలువురు పాక్ సైనికులు మరణించారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని పలు నగరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. సరిహద్దులోని పాక్ పోస్టులను ఆక్రమించింది.
తమ సార్వభౌమాధికారంపై దాడి జరిగిందని పేర్కొంటూ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై దాడి చేసింది. ఈ ఘర్షణలో 50 మందికి పైగా పాక్ సైనికులు మరణించారు. అక్టోబర్ 16, 18 మధ్య ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.అక్టోబర్ 19న యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత జరిగిన మూడు దశల శాంతి చర్చలు విఫలమయ్యాయి. వంబర్ 25న పాకిస్తాన్ తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో వైమానిక దాడి చేయగా.. తర్వాత TTP పాకిస్తాన్లోని పెషావర్లో ఉగ్రదాడికి పాల్పడింది.












Click it and Unblock the Notifications