కాశ్మీరీలకు మద్దతు, మా శత్రువులకు ఒకటే చెప్తున్నా..: పాక్ ఆర్మీ చీఫ్
లాహోర్: తమను ఓడించే ధైర్యం ఎవరికీ లేదని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ హెచ్చరించాడు. కాశ్మీర్ తమ దేశానికి మెడ నరం వంటిదని, అక్కడి ప్రజలకు దౌత్యపరమైన, నైతిక మద్దతును కొనసాగిస్తామని అతను మంగళవారం చెప్పాడు.
స్వయం నిర్ణయాధికారం కోసం కాశ్మీరు ప్రజలు చేస్తున్న గొప్ప త్యాగాలకు వందనం చేస్తున్నానని చెప్పాడు. ఐక్య రాజ్య సమితి తీర్మానాలను అమలు చేయడమే కాశ్మీరు సమస్యకు పరిష్కారమన్నాడు. పాకిస్థాన్ రక్షణ దినోత్సవాల సందర్భంగా రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్ వద్ద ఆయన మాట్లాడాడు.

పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ దుర్భేద్యమన్నాడు. నేను శత్రువులందరికీ స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని, పాకిస్థాన్ గతంలోనే బలమైనదని, ఇప్పుడు మరింత అజేయశక్తిగా, దుర్భేద్యంగా మారిందని అన్నాడు. తమకు శత్రువుల అన్ని రకాల కుట్రల గురించి తెలుసని చెప్పాడు.
సవాలు సైనికపరమైనదైనా, దౌత్యపరమైనదైనా, సరిహద్దులో అయినా, నగరాల్లో అయినా, మా శత్రువులెవరో, మిత్రులెవరో బాగా తెలుసునని చెప్పాడు. చైనా-పాకిస్థాన్ సంబంధాల గురించి రహీల్ షరీఫ్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలు ఉన్నాయన్నాడు.












Click it and Unblock the Notifications