అనుమతి లేకుండా మోడీ ఎలా వస్తారు?: కోర్టులో పిటిషన్
లాహోర్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లాహోర్లో పర్యటించడంపై వేసిన పిటిషన్ను స్వీకరించేందుకు లాహోర్ హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత శీతాకాల సెలవుకాలంలో దీనిని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా మోడీ, ఆయన వెంట ఉన్న ప్రతినిధులు పాక్లో పర్యటించారని, మోడీతోపాటు ప్రయాణిస్తున్న అనేకమందితో కూడిన ప్రతినిధి బృందం ఎలాంటి వీసా లేకుండా విమానాశ్రయం పరిసరాల్లో ఉన్నారని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది అజహర్ సాదిఖి పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్కు తిరిగి వెళ్లే సమయంలో నరేంద్ర మోడీ మార్గమధ్యంలో లాహోర్లో దిగి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నివాసమైన జతి ఉమ్రాకు వెళ్లి ఆయన ఆతిథ్యం స్వీకరించిన సంగతి తెలిసిందే.
కాగా, పిటిషన్ను హైకోర్టు రిజిస్ట్రార్ తిరస్కరించిన నేపథ్యంలో సెలవులు ముగిసిన తర్వాత మళ్లీ పిటిషన్ దాఖలు చేస్తానని సాదిఖి చెప్పారు.