పాకిస్తాన్ ఎప్పుడూ మా వ్యూహాత్మక భాగస్వామే: పాక్ పై ప్రేమ చాటిన డ్రాగన్ కంట్రీ
చైనా: పాకిస్తాన్ పట్ల తమ ప్రేమను మరోసారి చాటుకుంది డ్రాగన్ కంట్రీ. ఓ వైపు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య శాంతినెలకొనేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పిన చైనా... కొద్ది గంటల్లోనే పాక్పై తన వైఖరిని చాటుకుంది. చైనా తటస్థ వైఖరితో ఉందని పాకిస్తాన్ భావిస్తుండటం శుభపరిణామం అని చెప్పిన చైనా... భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి నెలకొనేలా ప్రపంచదేశాలు కూడా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని కోరింది.
జైషేమొహ్మద్ ఛీఫ్ మసూద్ అజహర్ను ఐక్యరాజ్య సమితి బ్లాక్లిస్టులో చేర్చేందుకు ప్రపంచదేశాలు తమ అభిప్రాయం చెప్పేందుకు మార్చి 13న చివరి రోజు కానున్న నేపథ్యంలో చైనా పాకిస్తాన్పై ప్రేమ చాటడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మసూద్ అజహర్ను ప్రపంచ ఉగ్రవాదిగా ముద్రవేయాలనే ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫ్రాన్స్ ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్ ప్రతిపాదనకు అమెరికా, యూకే మద్దతు తెలిపాయి. మరోవైపు చైనా మాత్రం పొరుగు దేశాల సమగ్రతను, సరిహద్దులను మరో దేశం గౌరవించాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది.
ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ విషయమై చర్చించేందుకే పాకిస్తాన్కు చైనా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి కాంగ్ క్సువాన్యూ వెళ్లినట్లు ఆ దేశ ప్రతినిధి లూకాంగ్ తెలిపారు. ఇక పాక్ పర్యటనలో కాంగ్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆదేశ ఆర్మీ ఛీఫ్, విదేశాంగ మంత్రులతో సమావేశమైనట్లు లూకాంగ్ చెప్పారు. పాకిస్తాన్ చైనా దేశాలు వ్యూహాత్మక భాగస్వాములని చెప్పిన కాంగ్... పాకిస్తాన్ను నిగ్రహంతో వ్యవహరించాలని సూచించినట్లు చెప్పారు. అంతేకాదు భారత్ పాక్ దేశాల మధ్య చర్చలు జరగాలని ఇందుకోసం చైనా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని లూకాంగ్ వెల్లడించారు. అదే సమయంలో పాకిస్తాన్ కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదని ఆయన చెప్పారు.