భారత్ తో పెట్టుకుని 58 రోజుల్లో 410 కోట్లు కోల్పోయిన పాకిస్తాన్ !
భారత్-పాకిస్తాన్ మధ్య పహల్గాంలోని ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు ఎన్నడూ లేనంత స్దాయికి చేరుకున్నాయి. ఈ ఉగ్రదాడికి కారకులైన వారిని తమకు అప్పగించాలంటూ భారత్ చేసిన డిమాండ్లను పాకిస్తాన్ పట్టించుకోలేదు. ఆ దాడికీ, తమకూ ఎలాంటి సంబంధం లేదని తప్పించుకునే యత్నం చేసింది. దీంతో భారత్ తమ గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలు వెళ్లకుండా మూసేసింది. దీంతో పంతానికి పోయి పాకిస్తాన్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ గగనతలాన్ని భారత విమానాలకు మూసేయడంతో మన విమానాలు చుట్టూ తిరిగి వివిధ దేశాలకు వెళ్లాల్సి వచ్చింది. దీని వల్ల మన విమానయాన సంస్థలకు నష్టం వాటిల్లింది. అయినా భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే భారత్ తో పోలిస్తే ఎన్నో రెట్లు పేద దేశమైన పాకిస్తాన్ కు మాత్రం అంతకన్నా తీవ్ర నష్టం జరిగింది. ఈ విషయాన్ని తాజాగా పాకిస్తాన్ పార్లమెంట్ లో రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

భారతీయ విమానాలకు తమ గగనతలాన్ని మూసేయడం వల్ల ఏకంగా 410 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు పాకిస్తాన్ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ వివరాలు అందించిందని పార్లమెంట్ లో రక్షణ శాఖ వెల్లడించింది. ఇలా భారతీయ విమానాలకు తమ గగనతలం మూసేయడం వల్ల ఏకంగా 20 శాతం ట్రాపిక్ తగ్గిపోయిందని కూడా తెలిపింది. దీంతో ఆయా భారత ఎయిర్ లైన్ సంస్ధల నుంచి ఛార్జీల రూపంలో రావాల్సిన మొత్తం రాకుండా పోయిందని పేర్కొంది.

ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకూ ఇలా పాకిస్తాన్ భారతీయ విమానాలు తమ గగనతలంపై ఎగురకుండా నిషేధం విధించింది. అంటే 58 రోజుల్లో పాకిస్తాన్ కేవలం ఈ ఒక్క నిర్ణయం వల్ల రూ.410 కోట్ల నష్టాల్ని చవి చూసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్న ఆర్దిక పరిస్దితుల్లో ఈ మొత్తం చాలా ఎక్కువే. గతంలో ఈ మొత్తం 850 కోట్లుగా లెక్కించినా తుది లెక్క మాత్రం 410 కోట్లుగా తేలిందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంట్ కు తెలిపారు. భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పార్లమెంట్ లో వెల్లడించారు.












Click it and Unblock the Notifications