తాలిబన్లకు పాకిస్తాన్ వార్నింగ్-అంతర్యుద్ధం తప్పదన్న ఇమ్రాన్ ఖాన్-అలా చేయాల్సిందే
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో కొలువుదీరిన తాలిబన్ల ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు ఇప్పించేందుకు తహతహలాడుతున్న పాకిస్తాన్ ఇవాళ వారికి ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలోతాలిబన్లలో విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ హెచ్చరిక వారిని కచ్చితంగా ఆలోచనలో పడేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే సార్క్ కూటమిలో తాలిబన్లకు చోటిప్పించేందుకు ప్రయత్నించి విఫలమైన పాకిస్తాన్.. తాజాగా వారికి చేసిన హెచ్చరిక అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమవుతోంది.
తాలిబన్ల సర్కార్లో లుకలుకలు
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల సర్కార్ ఏర్పాటై నెల రోజులు కూడా గడవకముందే అందులో లుకలుకలు బయటపడ్డాయి. ముఖ్యంగా ముల్లా బరాదర్, హైబతుల్లా అఖుంద్ జాదా వంటి నేతల్ని పక్కనబెట్టి కీలక స్ధానాల్ని మరొకరికి కట్టబెట్టడం, ఆప్ఘనిస్తాన్ లోని అన్ని వర్గాలకు చోటు కల్పించకపోవడం వంటి పరిణామాలతో తాలిబన్ల విభేధాలు బయటికి వచ్చాయి అంతే కాదు. ముల్లా బరాదర్ వంటి దౌత్య అనుభవం కలిగిన నేతను కాదని ఇతరులకు ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పిస్తుండటం వంటి పరిణామాలు తాలిబన్లపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పొరుగునే ఉన్న పాకిస్తాన్ ఈ పరిణామాల్ని ఇప్పటివరకూ నిశితంగా గమనిస్తూ వచ్చింది.
సార్క్ కూటమిలో దక్కని చోటు
మరోవైపు తాలిబన్లు అంతర్గతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే వారికి తాజాగా మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. పాకిస్తాన్ మద్దతిచ్చినా భారత ఉపఖండ దేశాలతో కూడిన సార్క్ కూటమిలో తాలిబన్ల నేతృత్వంలోని ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వానికి చోటు దక్కలేదు. ఇతర దేశాల విదేశాంగమంత్రులు పాల్గొన్న సార్క్ భేటీలో తాలిబన్ల సర్కార్ కు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరికి ఈ ఏడాది జరగాల్సిన సార్క్ భేటీయే రద్దయిపోయింది. ఇందులో పాకిస్తాన్ తాలిబన్లకు మద్దతివ్వబోయి అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది.
తాలిబన్లకు పాకిస్తాన్ వార్నింగ్
తాజా పరిణామాలపై అసహనంగా ఉన్న పాకిస్తాన్.. తాలిబన్లకు ఇవాళ గట్టి హెచ్చరికలు పంపింది. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు మిగిలిన అంశాల్లోనూ తాలిబన్ల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం పంపిన హెచ్చరికలు తాలిబన్లకు సూటిగా గుచ్చుకునేలా ఉన్నాయి. అదే సమయంలో అంతర్జాతీయంగానూ ఇవి చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా తాలిబన్లకు అంతర్జాతీయంగా గుర్తింపు ఇప్పించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న సమయంలో వారి వ్యవహారశైలి కారణంగా ఈ వ్యవహారం నానాటికీ ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉందన్న భావన పాకిస్తాన్ మాటల్లో కనిపిస్తోంది.
అంతర్యుద్ధం తప్పదన్న ఇమ్రాన్ ఖాన్
ఆప్ఘనిస్తాన్ లో ప్రస్తుతం నెలకొంటున్న పరిణామాలతో అంతర్యుద్ధం పరిస్ధితులు నెలకొంటున్నాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తాలిబన్లకు ఆయన ఓ సందేశంలో హెచ్చరికలు పంపారు. తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో చేసిన తప్పిదాల వల్ల అంతర్యుద్ధం జరిగే పరిస్దితులు పొంచి ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ వారిని హెచ్చరించారు. వెంటనే పరిస్ధితిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇమ్రాన్ వారికి పలు సూచనలు కూడా చేశారు. వాటిని తూచా తప్పకుండా పాటించాలని ఇమ్రాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది.
అలా చేయకపోతే అంతర్యుద్ధమేనన్న ఇమ్రాన్
తాలిబన్ల ప్రభుత్వంలో కొన్ని వర్గాలకే చోటు దక్కిందన్న భావన మిగిలిన వారిలో పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ చోటు కల్పిస్తూ సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఇమ్రాన్ ఖాన్ వారికి పునరుద్ఘాటించారు. ఆప్ఘన్ లో అన్ని గ్రూపులకు ప్రభుత్వంలో చోటు కల్పించాల్సిందేనన్నారు. అలా చేయడంలో విఫలమైతే మాత్రం అంతర్యుద్ధం తప్పదంటూ ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. ఆప్ఘన్ లోని అన్ని గ్రూపులకు ప్రభుత్వంలో చోటు కల్పించలేకపోతే చివరికి వారు దేశంలో అంతర్యుద్ధానికి కారకులవడంతో పాటు పాకిస్తాన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. తాలిబన్ల తప్పిదాలతో అంతర్యుద్ధం తలెత్తితే చివరికి అది మానవ సంక్షోభానికి , తమ దేశంలో వలసలు పెరగడానికి కూడా కారణమవుతుందని ఇమ్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు సమీకృత ప్రభుత్వం ఏర్పాటు చేయడం, మానవ హక్కులకు భంగం కలగకుండా చూడటం, తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలిగితేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.