లఖ్వీ విడుదల: సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పాక్ పంజాబ్ ప్రభుత్వం
లాహోర్: ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు, ఉగ్రవాది జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ విడుదలను సవాల్ చేస్తూ పాకిస్థాన్లోని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాహోర్ హైకోర్టు లఖ్వీని విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ పంజాబ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.
లష్కరే తొయిబా కమాండర్ అయిన లఖ్వీ 2008లో ముంబై దాడులకు పాల్పడి అనేక మంది ప్రాణాలపొట్టన పెట్టుకున్నాడు. లఖ్వీ విడుదలతో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయని, ప్రజల సాధారణ జనజీవనానికి లఖ్వీ విడుదల విఘాతం కలిగించే అవకాశాలున్నాయని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది.
ముంబై దాడి కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో లఖ్వీ విడుదల సరికాదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పంజాబ్ ప్రభుత్వం కోరింది. భద్రతా చట్టం ప్రకారం లాహోర్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి, లఖ్వీని తిరిగి అదుపులోకి తీసుకోవాలని కోర్టుకు విన్నవించింది.
లఖ్వీకి వ్యతిరేకంగా సెన్సిటివ్ డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా లాహోర్ హైకోర్టు జస్టిస్ ముహమ్మద్ అన్వరుల్ హక్.. లఖ్వీని అదుపులోకి తీసుకోవడం సరికాదని, అతడ్ని విడుదల చేస్తూ ఏప్రిల్ 9న తీర్పు చెప్పారు. కాగా, ఇంటెలీజెన్స్ సంస్థ సాయంతో రూపొందించిన సెన్సిటివ్ నివేదికలు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు ముందుంచారు.
అయితే లఖ్వీని అదుపులోకి తీసుకునేందుకు ఈ నివేదికలు చాలావని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ముంబై దాడి కేసులో 6ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన లఖ్యీ, ఏప్రిల్ 10న రావల్పిండిలోని అదియలాల్ జైలు నుంచి విడుదలయ్యాడు. లఖ్వీ విడుదలపై భారత్ తోపాటు అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా మండిపడ్డాయి. ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరి ఇదేనా అని ప్రశ్నించాయి.