భారత్లో విలీనం: పీఓకే ప్రజలపై పాక్ అరాచకాలు(వీడియో)
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్థాన్ అరాచకాలకు అంతులేకుండా పోతోంది. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ప్రజలపై పోలీసులు, సైనికుల సాయంతో ప్రభుత్వం తీవ్రమైన దాడులకు పాల్పడుతోంది. భారతదేశంలో కలిసేందుకు మొగ్గుచూపుతున్న ఆ ప్రాంతంలోని ప్రజల ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేస్తోంది.
అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించే పాకిస్థాన్ తను ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం మానవ హక్కులను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ ప్రజల ఉద్యమాల అణచివేతకు పాల్పడుతోంది. దీంతో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఐక్యరాజ్య సమితికి పిర్యాదు చేస్తున్నారుః
కాగా, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అంతర్జాతీయ వేదికలపై జమ్మూకాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. నిజానికి జమ్మూకాశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఉండగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రం భద్రతా దళాల జులుం కొనసాగుతోంది.
ముజఫరాబాద్, గిల్గేట్, కోట్లీ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేసేందుకు భద్రతా దళాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించే వారిపై తీవ్రంగా దాడుల చేస్తూ భయకంపితులను చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పాక్ వ్యతిరేక నినాదాలు ఇస్తే చావగొడుతున్నారు.
పీఓకేలోని ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది పాకిస్థాన్ ప్రభుత్వం. వారికి మౌళిక సదుపాయాలను కూడా కల్పించకుండా వారిని నిర్లక్ష్యం చేస్తోంది. ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తోంది.
కాగా, ఆక్రమిత కాశ్మీర్లో మెజారిటీ పక్షం పాకిస్థాన్ను వ్యతిరేకిస్తున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. కొందరు స్వాతంత్య్రం కోరుకుంటుంటే, మెజార్టీ ప్రజలు మాత్రం భారత్లో విలీనం అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఆర్మీ బలంతో పీఓకే ప్రజల ఉద్యమాలను అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిపై పాకిస్థాన్ మౌనం వహిస్తోంది. పైగా ఇదంతా ఇండియా సృష్టిస్తున్న రాద్దాంతమని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.
కాగా, పీఓకే ప్రజలపై జరుగుతున్న దాడులను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖండించింది. పాక్ దురాగాతాలను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షం సహకరించాలని కోరుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రభుత్వం పీఓకేలోని ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తోందని ఆరోపించారు.