కంపెనీ సీఈవో ఉబర్ క్యాబ్ డ్రైవర్ అయ్యాడు
లండన్: ఓ ప్రముఖ కంపెనీ సీఈవోగా ఉన్న వ్యక్తి ఉబర్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఆయన కంపెనీకి నష్టాలు రావడం వలన క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తలేదు.
అతను మరో కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన బ్రాక్ గ్రౌండ్ రెడీ చేసుకున్నాడు. ఫ్లైట్ లకు సంబంధించిన సమాచారం, విహారయాత్రలకు సంబంధించిన వివరాలు, హోటల్స్ తదితర సేవలు అందించే కాయక్ వెబ్ సైట్ కో ఫౌండర్ పాల్ ఇంగ్లీష్.
ఆ కంపెనీ సీఈవో అయిన పాల్ ఇంగ్లీష్ 2012లో దాదాపు రూ. 1,400 కోట్లకు కాయక్, ప్రిన్స్ లైన్ సంస్థలను విక్రయించాడు. తరువాత ఉబర్ సంస్థలో డ్రైవర్ గా పని చేశాడు. అయితే డ్రైవర్ డ్రస్ లో ఉన్న పాల్ ఇంగ్లీష్ను కస్టమర్లు ఈజీగా గుర్తు పట్టేస్తున్నారంట.
పాల్ ఇంగ్లీష్ ఇటీవల లోలా పేరుతో ఓ కొత్త సంస్థను ప్రారంభించాడు. ఈ వెంచర్ లో ట్రావెల్ బుకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ట్రావెల్ బుకింగ్ విధానాన్ని సులభతరం చెయ్యడానికి లోలా ఉపయోగ పడుతుందని పాల్ ఇంగ్లీష్ తెలిపారు.