కో పైలట్కు మత్తుమందిచ్చి రేప్ చేసిన అలాస్కా ఎయిర్లైన్స్ కెప్టెన్!
వాషింగ్టన్: తనకు మత్తుమందిచ్చి.. స్పృహలేని స్థితిలో ఉన్న తనపై అలాస్కా ఎయిర్ లైన్స్ కెప్టెన్ పాల్ ఏంజెలిన్ అత్యాచారం చేశాడని కో పైలట్ బెట్టీ పినా సంచలన ఆరోపణలు చేసింది. 2017 జూన్ నెలలో విమానం డ్యూటీలు మారే నిమిత్తం తాము మిన్నేపోలిస్లో సేదదీరుతున్న వేళ ఈ ఘటన జరిగిందని చెబుతూ ఆమె ఫిర్యాదు చేసింది.
మూడు రోజుల పాటు తామిద్దరమూ కలిసి పనిచేయాల్సి వచ్చిందని, తాను ఓ గ్లాస్ వైన్ తీసుకుని, రెండో గ్లాస్ను చేతికి తీసుకున్నట్టు మాత్రమే తనకు గుర్తుందని, ఆ తరువాత స్పృహలోకి వచ్చేసరికి తాను బెడ్పై ఉన్నానని ఆమె పేర్కొంది.
అంతేకాదని, తన లోదుస్తులు తొలగించి ఉన్నాయని, బెడ్ పై వాంతి చేసుకున్న స్థితిలో తాను ఉన్నానని చెబుతూ.. తనపై అఘాయిత్యానికి పాల్పడిన కెప్టెన్తోపాటు అలాస్కా ఎయిర్ లైన్స్కు వ్యతిరేకంగా కో పైలట్ బెట్టీ పినా ఓ కేసును దాఖలు చేసింది.
తనపై జరిగిన అఘాయిత్యం గురించి తాను ఎయిర్ లైన్స్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కెప్టెన్గా అతడ్నే కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించింది. గతంలో సైన్యంలోనూ పని చేసిన పినా, ఇటువంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయని ఆరోపించింది.
ఇదే తొలికేసు కాదని, ఇదే చివరి కేసు కూడా కాదన్న సంగతి తనకు తెలుసునని, బాధ్యత తీసుకోవాల్సిన యాజమాన్యాలు అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని 'సియాటెల్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెట్టీ వ్యాఖ్యానించింది.
కాగా, కో పైలట్ బెట్టీ పినా దాఖలు చేసిన లా సూట్పై ఇప్పుడు అమెరికాలో చర్చ జరుగుతోంది. పనిచేసే చోట లైంగిక వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.