యుద్ధానికి సిద్ధమవుతోందా?: టిబెట్లో అడ్వాన్స్డ్ ట్యాంక్తో తీవ్ర కసరత్తులు
భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుకు సమీపంలోనే ఉండే టిబెట్ ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ చేపట్టింది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.
బీజింగ్: భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుకు సమీపంలోనే ఉండే టిబెట్ ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ చేపట్టింది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 5,100మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఇలాంటి కసరత్తులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అడ్వాన్స్డ్ ట్యాంక్
అంతేగాక, ఈ కసరత్తులో పీఎల్ఏకు చెందిన ఆధునిక యుద్ధ ట్యాంక్(అడ్వాన్స్డ్ బ్యాటిల్ ట్యాంక్)ను కూడా ఉపయోగించడం గమనించదగ్గ విషయం. ఈ టైప్ 96బీ ట్యాంక్ ను ఉపయోగించడం ద్వారా తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించినట్లు స్పష్టమవుతోంది.
తీవ్ర కసరత్తులపై కథనాలు
ఈ మేరకు జిన్హువా న్యూస్ ఏజెన్సీ కథనాలను కూడా ప్రచురితం చేసింది. ఈ టైప్ 96బీ ట్యాంక్ తొలిసారి రంగంలోకి దిగిందని ఫొటోలతో జులై 3న ప్రచురితం చేసింది. అయితే, డ్రిల్ ఎప్పుడు జరిగిందనే విషయం మాత్రం ఆ కథనంలో పేర్కొనలేదు.
తొలిసారి..
5,100మీటర్ల ఎత్తులో తొలిసారి ఈ ట్యాంక్ దర్శనమిచ్చిందని తెలిపింది. ఈ ట్యాంక్ రావడంతో అక్కడంతా యుద్ధ వాతావరణం నెలకొందని పేర్కొంది. దీనిపై లైవ్ ఫైర్ షూటింగ్ శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపింది.
సిద్ధమవుతున్నట్లే..
అధికారులు కమాండ్ స్కిల్స్ నేర్పేందుకు కూడా ఈ కసరత్తులను ఉపయోగిస్తున్నారని తెలిపింది. అంటే చైనా ఒక వేళ యుద్ధం వచ్చినా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేందుకు ఈ కసరత్తులను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక, ‘భారత భద్రత బలగాలను విరమించుకోండి' అని చైనా కోరినట్లు గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే, భారత్ మాత్రం ఇందుకు నిరాకరించింది. తమను తమ భూభాగం నుంచి వెళ్లిపోమనడం ఏంటని ప్రశ్నించింది.