పాకిస్థాన్కు షాకిచ్చిన మోడీ చైనా పర్యటన: చాయ్ పే చర్చ, కీలక అంశాల ప్రస్తావన
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా చైనాకు వెళ్లిన సంగతి తెలిసిందే. 'ఎటువంటి ఒప్పందాలు, సంతకాలు, అధికారిక ప్రకటనలకు తావు లేకుండా మనసు విప్పి మాట్లాడుకుందాం' అని చెప్పిన చైనా అధ్యక్షుడి పిలుపు మేరకు మోడీ గురువారం రాత్రి చైనాకు చేరుకున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం వుహాన్ ప్రావిన్స్కు చేరుకున్న మోడీకి అపూర్వ ఆహ్వానం లభించింది. శనివారం కూడా ఇరు దేశాల నేతల మధ్య అనధికారిక చర్చలు సాగాయి.
గంటపాటు పడవలో..
ప్రఖ్యాత ఈస్ట్ లేక్ వద్ద ఇరువురు నేతలు నదీ తీరాన కాసేపు నడుచుకుంటూ మాట్లాడుకున్నారు. తేనీరు స్వీకరించారు. తర్వాత డబుల్ డెక్కర్ పడవలో మోడీ, జిన్పింగ్లు విహారం చేశారు. బోటులో కూర్చుని పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దు అంశం కూడా చర్చించినట్లు సమాచారం. దాదాపు గంట పాటు వారు పడవలో ప్రయాణించారు. బోటులో కూడా మోడీ, జిన్పింగ్ టీ తాగుతూ ముచ్చటించారు. చైనా అధ్యక్షుడితో అనధికార చర్చల్లో పాల్గొనడం గొప్ప అవకాశమని మోడీ అన్నారు.
ఆతిథ్యం ఊహించలేదు
మోడీని అనధికారిక పర్యటనకు ఆహ్వానించి జిన్పింగ్ చైనా-భారత్ సంబంధాల విషయంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మోడీ, జిన్పింగ్ల బోటు విహారం అనంతరం అతిథి గృహంలో భోజన ఏర్పాట్లు చేశారు. మోడీ, జిన్పింగ్ ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత మోడీ భారత్కు బయలుదేరారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ...‘ ఇక్కడి ఆతిథ్యాన్ని ఊహించలేదు. ఇంతగొప్ప ఆతిథ్యం ప్రధాని హోదాలో నా ఒక్కరికే అందించారేమో. విందు బాగుంది. జిన్పింగ్తో విలువైన సమయం గడపడం బాగుంది' అని అన్నారు.
మోడీని ఆశ్చర్యపర్చిన జిన్పింగ్
అయితే పర్యటనలో భాగంగా మోడీని జిన్పింగ్ ఆశ్చర్య పరిచారు. ప్రఖ్యాత ఈస్ట్ లేక్ వద్ద ఉన్న ప్రభుత్వ అతిథి గృహంలో మోదీకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందులో మరో విశేషమేంటంటే విందులో భాగంగా మెనూ కార్డును స్వయంగా జిన్పింగ్ దగ్గరుండి తయారు చేయించారట. మోడీ అభిరుచి మేరకు, భారత జాతి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెనూ కార్డుమీద జాతీయ జెండా రంగులను ముద్రించారు. మధ్యలో భారత జాతీయ పక్షి నెమలిని ఉంచి దానికింద చైనా-వుహాన్ అని ముద్రించి ఉన్న మెనూ కార్డును చూసి మోడీ ఆశ్చర్యపోయారని అక్కడి అధికారులు తెలిపారు. వెంటనే అక్కడి అధికారులందరికీ మోడీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పాకిస్థాన్కు మోడీ పర్యటన షాక్
ఇది ఇలా ఉండగా, మోడీ పర్యటన పాకిస్థాన్కు షాకిచ్చింది. ఆప్ఘనిస్థాన్లో సంయుక్తంగా ఆర్ధిక ప్రాజెక్టు చేపట్టేందుకు భారత్-చైనా అంగీకారం తెలిపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆత్మీయ సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు అవసరమైన విధివిధానాలపై ఇరువైపుల అధికారులు త్వరలోనే చర్చలు జరపనున్నట్టు సమాచారం. సర్వ సమయాల్లోనూ చైనానే తన ‘ప్రాణమిత్రుడు'గా భావిస్తున్న పాకిస్తాన్కు తాజా పరిణామాలు తలనొప్పిగా మారినట్లైంది.
అఫ్ఘాన్లో తొలిసారి
గత కొంతకాలంగా పాక్కు చైనా వెనకుండి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనా-పాక్లు కలిసి ఎకనామిక్ కారిడార్(సీపెక్)ను కూడా ప్రారంభించాయి. దీన్ని అఫ్గానిస్థాన్కు కూడా విస్తరించాలని ఇరు దేశాలు భావించాయి. ఇప్పుడు భారత్తో కలిసి అఫ్గానిస్థాన్లో ప్రాజెక్టును చేపట్టేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంగీకారం తెలిపారు. దీంతో పాకిస్థాన్కు ఇది చేదు వార్తగా మారింది. కాగా, మారణహోమం సృష్టిస్తున్న తాలిబన్లకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తోందంటూ ఆఫ్ఘనిస్తాన్, అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్లో కల్లోలం రేపుతూ శాంతి ప్రక్రియకు విఘాతం కల్పించడంపై పాక్ను నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడూ వ్యూహాత్మకంగా పాకిస్థాన్ను వెనకేసుకొచ్చే చైనా... ఆఫ్ఘనిస్థాన్లో ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టడం ఇదే తొలిసారి.