జపాన్ లో భారీ భూకంపం- టోక్యోలో బ్లాక్ అవుట్
Japan earthquake: జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో స్థానిక అధికారులు తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించారు. బీచ్ లను తాత్కాలికంగా మూసివేశారు. ప్రకంపనల తీవ్రత పలు ప్రాంతాలపై పడింది. కొన్ని చోట్ల భవనాలు బీటలు వారాయి. పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. అయిదుమందికి గాయాలైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9గా రికార్డయింది. జపాన్ దక్షిణ ప్రాంతం ఇబరాకీ ప్రీఫెక్షర్ లో ఆ దేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:17 నిమిషాలకు భూమి ప్రకోపించింది. రాజధాని టోక్యోకు దక్షిణ దిశగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రీఫెక్ఛర్. దీని పరిధిలోని హోన్షు సిటీకి తూర్పున 36 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.

ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల దిగువన టెక్టోనిక్ ప్లేట్లల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. దీని తీవ్రత పలు ప్రాంతాలపై పడింది. భూమి ప్రకంపించిన వెంటనే వెంటనే జనం రోడ్ల మీదికి పరుగెత్తారు. ఇళ్లు, ఆఫీసులు, ఇతర నివాసాలను ఖాళీ చేశారు. ఇబరాకీలో అయిదుమంది గాయపడినట్లు జపాన్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది. తీర ప్రాంతం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదవుతోండటంతో జనం తమ నివాసాల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. తీవ్ర భూకంప ప్రభావం దృష్ట్యా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను తక్షణమే సురక్షిత, ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవాలని స్థానిక యంత్రాంగం సూచించింది. ఇబరాకీకి ఆనుకునే ఉన్న సైటామా, చీబా ప్రీఫెక్చర్లల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా రాజధాని టోక్యోకు అతి సమీపంలో ఉండే ప్రాంతాలు.
అక్కడున్న విద్యుత్ కేంద్రాలు ప్రభావితం కావడం వల్ల టోక్యోలో బ్లాక్ అవుట్ సంభవించింది. విద్యుత్ సరఫరా స్తంభించింది. టోక్యో ఈశాన్య ప్రాంతంలో లోకల్ రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎన్ హెచ్ కే పబ్లిక్ టెలివిజన్ పేర్కొంది. ఈ భూకంపం కారణంగా టోక్యోలో సుమారు 500 వరకు నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ను సరఫరాను పునరుద్ధరిస్తోన్నట్లు టెప్కో పవర్ గ్రిడ్ తెలిపింది.
జపాన్.. భూగోళికంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో క్రియాశీలక అగ్నిపర్వత జోన్లో ఉంటోంది. ప్రపంచంలోనే అత్యధిక భూకంప నెట్వర్క్లో ఉన్నందున ప్రకంపనలు సర్వసాధారణం. మూడు లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో భూమి తరచూ ప్రకంపిస్తుంటుందక్కడ. తాజాగా 5.9 తీవ్రతతో భూమి కంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జపాన్లో భూకంప తీవ్రతను లెక్కించడానికి షిండో స్కేల్ను ఉపయోగిస్తారు. దీని ప్రకారం నాలుగు లేదా అంతకంటే తక్కువ తీవ్రత ఉన్న భూకంపాలను తేలికపాటివిగా పరిగణిస్తారు. అయిదు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ప్రకంపనలు తీవ్రమైనవిగా భావిస్తారు.














Click it and Unblock the Notifications