Rishi Sunak : రిషి సునాక్ మరో షాక్- COP 27 అంతర్జాతీయసదస్సు మధ్యలోనే బయటికి..
అనూహ్య రీతిలో బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపట్టిన రిషీ సునాక్ ఇప్పుడు అంతే అనూహ్యంగా తన నిర్ణయాలతో ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా ఐరాస ఈజిప్ట్ లో నిర్వహిస్తున్న వాతావరణమార్పుల సదస్సు కాప్ 27లో పాల్గొనేది లేదని ప్రకటించిన ఆశ్చర్యపరిచిన సునాక్.. కాసేపటికే తన నిర్ణయం మార్చుకుని హాజరవుతానని ప్రకటించారు. ఈ షాక్ నుంచి జనం కోలుకోక ముందే ఈజిప్ట్ కు వెళ్లిన రిషీ అక్కడ కూడా అదే వైఖరి కొనసాగించారు.
UK prime minister @RishiSunak has just been rushed out of the room by his aides during the middle of the launch for forests partnership at #COP27 pic.twitter.com/OQy9TYkqpX
— Leo Hickman (@LeoHickman) November 7, 2022
ఈజిప్ట్ లోని షర్మెల్ షేక్ లో వాతావరణ మార్పులపై చర్చించేందుకు ఐరాస నిర్వహిస్తున్న సభ్య దేశాల సదస్సు కాప్ 27లో అటవీ భాగస్వామ్యంపై ఓ కీలక ఒప్పందం జరుగుతోంది. ఇందులో పాల్గొంటున్న రిషీ సునాక్ కు ఇది ఎంత కీలకమైందో కూడా తెలుసు. కానీ ఆయన అక్కడి నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఏం జరిగిందో తెలియక గందరగోళం నెలకొంది. మొత్తంగా బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ నిర్ణయంతో నిర్వాహకులు కూడా నివ్వెరపోయారు.
కాప్ 27 సదస్సులో పాల్గొనేందుకు అయిష్టంగానే వచ్చిన రిషీ సునాక్.. అటవీ భాగస్వామ్యంపై ప్రధాన దేశాలన్నీ పాల్గొంటున్న తరుణంలో మధ్యలో ఓ వ్యక్తి ఆయన చెవిలో ఏదో చెప్పి వెళ్లారు. ఆ తర్వాత కూడా అక్కడే ఉన్న రిషీ సునాక్.. మరో వ్యక్తి కాసేపటి తర్వాత వచ్చి మరో వార్త చెప్పగానే హడావిడిగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ సదస్సు జరుగుతున్న హాల్ నుంచి సునాక్ వెళ్లిపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ విషయం కూడా యూకేకు చెందిన కార్బన్ బ్రీఫ్ కంపెనీ డైరెక్టర్ లియో హిక్ మాన్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించడంతో అందరికీ తెలిసింది. అయితే రిషీ సునాక్ అలా ఎందుకు సడన్ గా లేచి వెళ్లిపోయారన్నది మాత్రం స్పష్టం కాలేదు.