రష్యాకు భంగపాటు : చోర్నోబైవ్కాలో 12వ సారి విఫలం..! కీవ్ నుంచి సేనల ఉపసంహరణ?
ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న రష్యా సేనలకు భంగపాటు తప్పడం లేదు. క్షిపణులు, మిస్సైల్స్తో విధ్వంసకర దాడులకు దిగిని మాస్కో బలగాలకు ఉక్రెయిన్ సైనికులు చుక్కలు చూపిస్తున్నారు. వారి చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. నెల రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తున్నా ప్రధాన నగరాలపై పట్టుసాధించలేకపోతున్నాయి. రష్యా దళాలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నాయి. దీంతో వారు హస్తగతం చేసుకున్న నగరాలను తిరిగి ఉక్రెయిన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంటోంది. చెర్నోబిల్ నగరాన్ని రష్యా దళాలు వీడినట్లు స్థానిక మేయర్ తెలిపారు. స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో ఆప్రాంతం నుంచి వెళ్లిపోయాయి.
చెర్నోబిల్ను వీడిన రష్యా దళాలు
అటు చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్కు సమీపంలోనే ఉన్న పట్టణం నుంచి కూడా మాస్కో సైనిక బృందం వెళ్లిపోయింది. తొలుత స్లావిచ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక మేయర్ను కూడా నిర్బంధించడంతో అక్కడ ప్రజలు రష్యా సేనలను అడ్డుకున్నారు. రోడ్లపై నిరసన తెలిపారు. దీంతో మాస్కో దళాలు ఈ ప్రాంతం నుంచి నిష్క్రమించాయి.
లుహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాల్లో రష్యా జరిపిన భీకర దాడులను కూడా ఉక్రెయిన్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. రెండు యుద్ద ట్యాంకులు, వాహనాన్ని ధ్వంసం చేశాయి. ఈ ప్రతిదాడుల్లో రష్యాసైనికులు కూడా మృతిచెందినట్లు ఉక్రెయిన్ పేర్కొంది.
మాస్కోకు 12వ సారి భంగపాటు
మరోవైపు.. చోర్నోబైవ్కాలోని విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకోనేందుకు ప్రయత్నించిన మాస్కో దళాలు 12వ సారి కూడా భంగపడ్డాయి. ఈ వ్యూహాత్మక విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇది ఉక్రెయిన్ ఆర్మీ ప్రతిఘటన సామర్ధానికి నిదర్శనమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహాయకుడు ఒలెక్సీ అరెస్టోవిచ్ పేర్కొన్నారు. గత వారం రష్యా లెప్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాంత్సెవ్ ను హతమర్చింది కూడా ఇక్కడే అని తెలిపారు.
డాన్బాస్ వైపు రష్యా సేనల దృష్టి
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా సేనలు పట్టుసాధించలేకపోవడంతో.. అవి డాన్బాస్ రీజియన్ ప్రాంతం వైపు దృష్టి పెట్టినట్లు ఉక్రెయిన్ తెలిపింది. తమ ప్రతిఘటనలతో రష్యాకు భారీగానే నష్టం వాటిల్లిందని పేర్కొంది. కీవ్ నుంచి తమ సైనికులను రష్యా ఉపసంహరించుకుందని వెల్లడించింది.
డాన్బాస్ వైపు సాగుతున్న వారికి ... మరలా పరాభవం తప్పదని ఉక్రెయిన్ హెచ్చరించింది. ఉక్రెయిన్దే పైచేయి అవుతోందని ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటికే రష్యా వద్ద యుద్ధ సామాగ్రి కూడా నిండుకున్నాయని , సైనికులు కొరత వెంటాడుతోందని పేర్కొంది. ధర్మయుద్ధంలో అంతిమ విజయం తమదేనని ఉక్రెయిన్ తెలిపింది..