భారత్లో రష్యా విదేశాంగ మంత్రి పర్యటన.. చర్చించే అంశాలు ఇవే
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజీ కోసం అన్నీ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కఠినతరం చేసిన వేళ.. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ లో కీలక నగరాలను ఆక్రమించుకున్నామని రష్యా ప్రకటించగా..16 వేలమందికి పైగా రష్యన్ సైనికులను మట్టుపెట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
ఉక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం ముగిసిందని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్లో తమ సైన్యం ఆక్రమించిన నగరాలను పాక్షికంగా ఖాళీచేసి వెళ్తున్నట్లు ప్రకటించింది. డాన్బాస్ ప్రాంతాన్ని స్వతంత్ర ప్రాంతంగా ఏర్పాటు చేయడమే తమ ముందున్న కర్తవ్యమని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన అప్పటి నుంచి రష్యాకు చెందిన ఒక అత్యున్నత స్థాయి అధికారి భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. యుద్ధం ప్రారంభించే సరిగా రెండు నెలల ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. యుద్ధం అనంతరం ఇరు దేశాల నేతలు, దౌత్యవేత్తలు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపడం తప్పా ప్రత్యేక భేటీ నిర్వహించలేదు.
సెర్గీ లావ్రోవ్ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య కరెన్సీ మార్పిడి, ఆ దేశం నుండి సైనిక పరికరాలు మరియు విడిభాగాల డెలివరీలో ఆలస్యం, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావంతో పాటు ముడి చమురు సరఫరా వంటి కీలక విషయాలపై చర్చించారు. యుద్ధం నేపథ్యంలో రష్యా కరెన్సీ రూబుల్స్ దారుణంగా పడిపోయిన నేపథ్యంలో భారత కరెన్సీలో చెల్లింపులు చేయాలని రష్యా నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనిని భారత విదేశాంగశాఖ కొట్టిపారేసింది.
రష్యా నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అందించాల్సిన s-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇండియన్ ఆర్మీకి అందించాల్సిన Ak-203 అసాల్ట్ రైఫిల్స్ డెలివరీపై ఇరుదేశాలు చర్చించనున్నాయి.