నిరాశపర్చిన పుతిన్-విక్టరీ డే రోజున పసలేని ప్రసంగం-మాతృభూమి కోసమే ఉక్రెయిన్ పోరంటూ
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభమై రెండు నెలలు దాటిపోయినా ఫలితం తేలలేదు. ఈ నేపథ్యంలో నాజీలపై సోవియట్ యూనియన్ విజయం సాధించిన విజయానికిు గుర్తుగా ఏటా రష్యా జరుపుకునే విక్టరీ డే పరేడ్ సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కీలక ప్రకటన చేస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.
విక్టరీ డే సందర్భంగా ఇవాళ రష్యాలో నిర్వహించిన పరేడ్ లో పాల్గొన్న అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్.. తన ప్రసంగంలో ఉక్రెయిన్ పోరు మాతృభూమి కోసమేనని వ్యాఖ్యానించారు. నాజీయిజానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ గడ్డపై పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రపంచ యుద్ధంతో మరోసారి భయానక పరిస్థితులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ లో ఆమోదయోగ్యం కాని ముప్పుతో రష్యా పోరాడుతోందని చెప్పిన వ్లాదిమీర్ పుతిన్ అంతా ఊహించినట్లు యుద్ధంపై కీలక ప్రకటనేమీ చేయలేదు. అంతకు ముందు.. విక్టరీ డే వేదికగా పుతిన్.. యుద్ధాన్ని తీవ్రతరం చేయబోతున్నట్లు లేదంటే యుద్ధవిరమణ ప్రకటన చేయొచ్చంటూ కొన్ని కథనాలు వెలువడినా అవి నిజం కాదని తేలిపోయింది.

మాతృభూమి కోసం మీరంతా పోరాడుతున్నారని, ఉక్రెయిన్లోని 'మాతృభూమి'ని రష్యా రక్షించుకునే యత్నం చేస్తోందని వ్లాదిమీర్ పుతిన్ చెప్పుకొచ్చారు. దేశ భవిష్యత్తు కోసమే ఇదంతా అని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠాలను ఎవరూ మర్చిపోవద్దంటూ అప్రమత్తం చేశారు. ఈ సంక్షోభానికి ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించిన పుతిన్.. కీవ్, దాని మిత్ర పక్షాలు రష్యాకు చెందిన చారిత్రక ప్రాంతాలన ఆక్రమించే యత్నం చేశాయంటూ వ్యాఖ్యానించారు. రష్యాకు మరో ఆప్షన్ లేదని కాబట్టి తమ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకునేందుకు తీసుకున్న సరైన నిర్ణయం అని మిలిటరీ చర్యను పుతిన్ సమర్ధించారు.












Click it and Unblock the Notifications