జెట్ క్రాష్: రెబెల్స్ వెనక రష్యా, ఆసీస్ ప్రధాని నింద
సిడ్నీ/ మాస్కో: ఉక్రెయిన్లో మలేషియా విమానం కూల్చివేత పర్యవసానాలు అంతర్జాతీయంగా తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. మలేషియా విమానం కూలిన సంఘటనపై రష్యా ప్రతిస్పందించిన తీరుపై ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా తీరు పట్ల తాను అత్యంత అసంతృప్తికరంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
విమానం కూలగానే రష్యా దౌత్యవేత్త ఉక్రెయిన్ను నిందించారని, ఇది అత్యంత అసంతృప్తికరమైన స్పందన అని ఆయన అన్నారు. అది ప్రమాదం కాదని, నేరమని అన్నారు. రష్యా మద్దతు ఉ్న తిరుగుబాటుదార్లు ఆ చర్యకు బాధ్యులుగా కనిపిస్తున్నారని ఆయన అన్నారు.
ఉక్రెయిన్లో సమస్యలున్నాయని అందరికీ తెలుసునని, సమస్యలకు ఎవరిని తప్పు పట్టాలో కూడా మనకు తెలుసునని, ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్లో జరిగింది కాబట్టి తనకు సంబంధం లేనట్లుగా రష్యా మాట్లాడుతోందని, అది నిలబడే విషయం కాదని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నిలబడాలనుకుంటే రష్యా దర్యాప్తునకు సహకరించాలని ఆయన అన్నారు.
కాగా, ఉక్రెయిన్ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ శుక్రవారంనాడు అన్నారు. మలేషియా విమానం ప్రమాదంలో మరణించినవారిలో అత్యధికులు నెదర్లాండ్స్ వాళ్లే ఉన్నారు. నెదర్లాండ్కు చెందిన 154 మంది ప్రమాదంలో మరణించారు. దీంతో పుతిన్ డచ్ ప్రధానిక మార్క్ రుట్టెకు తన సంతాపాన్ని తెలియజేశారు
ఈ సంఘటన ఉక్రెయిన్ సమస్యను తక్షణమే శాంతియుతంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. సమగ్రమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాల్సి ఉందని రుట్టేతో పుతిన్ మాట్లాడిన తర్వాత క్రెమ్లిన్ ప్రకటనలో అన్నారు.