లొంగిపోతే ప్రాణభిక్ష - మారియపోల్ స్వాధీనం : అమెరికాకు రష్యా హెచ్చరిక..!!
ఉక్రెయిన్ లో పైన పోరులో రష్యా కీలక లక్ష్యం చేరింది. భాగంగా అజోవ్ సముద్రతీర నగరం మారియుపోల్ రష్యా స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే ఈ నగరాన్ని నామరూపాలు లేకుండా చేసిన రష్యా సేనలు పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. శివార్లలో ఉన్న అతిపెద్దదైన అజోవ్స్టాల్ స్టీల్ ప్లాంట్ను కైవసం చేసుకున్నాయి. అక్కడ 400 మంది కిరాయి సైనికులు తమవారితో పోరాడుతున్నట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ తరఫున ఇంకా సుమారు 2,500 మంది ఈ నగరంలో తమ సేనలను ప్రతిఘటిస్తున్నట్లు భావిస్తున్న రష్యా.. లొంగిపోవాలంటూ వారికి అల్టిమేటం జారీ చేసింది.

రష్యా యుద్దంలో కీలక నగరం స్వాధీనం
ఈ నగరం పైన పట్టు కోసం రష్యా సేనలు తొలి నుంచి ప్రయత్నిస్తున్నా..మరైన్ సేనలు తిప్పి కొట్టాయి. ఇదే సమయంలో రాజధాని నగరం కీవ్పై రష్యా తన క్షిపణి దాడులను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 1,875 బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ వారంలో బ్రోవరీలో జరిగిన దాడుల్లో.. శిథిలాల కింద 41 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక్కడి రక్షణ పరిశ్రమను పూర్తిగా నేలమట్టం చేసినట్లు రష్యా ప్రకటించింది. కాగా.. అమెరికాకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాను ఆపకుంటే.. తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉక్రెయిన్కు భారీ ఎత్తున జావెలిన్ క్షిపణులు, అధునాతన ఆయుధాలను అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన నేపథ్యంలో రష్యా తీవ్రంగా స్పందించింది.

లొంగిపోవాలంటూ హెచ్చరిక
మారియపోల్లోని హల్కింగ్ స్టీల్ ప్లాంట్లో దాగుకుని దాడులు చేస్తున్న వందలాది మంది ఉక్రెయిన్, విదేశీ సైనికులను లంగిపోవాలని రష్యా ఆదేశించింది. ఆయుధాలు అప్పగించి లంగిపోతే సురక్షితంగా బయటకు పోయేందుకు అనుమతిస్తామని రష్యా సైన్యం తెలిపింది. ఈ ఆఫర్ను ఉక్రెయిన్ సేనలు తిరస్కరించినట్లు జెలెన్స్కీ చెప్పారు. రష్యన్ సేనలు మారియపోల్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఆయుధ కర్మాగారాన్ని తమ దళాలు శనివారం పూర్తిగా ధ్వంసం చేశాయని రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై దాడులకు రష్యా సన్నాహాలు చేస్తోంది. క్రిమియా ద్వీపకల్పం ఇప్పటికే రష్యాలో విలీనమైనందున మారియపోల్, తూర్పు ప్రాంతంలోని ఉక్రెయిన్ పారిశ్రామిక కేంద్రమైన డాన్బాస్లను కలుపుకుని రష్యా పటిష్టమైన స్థితికి చేరుకుంటుంది. ఉక్రెయిన్ దళాలు ఎంతగా ప్రతిఘటించినా రష్యన్ దళాలు ముందుకెళ్లకుండా ఆపలేకపోయాయి.

అమెరికాకు పుతిన్ వార్నింగ్
మరో వైపు..ఉక్రెయిన్కు ఆయుధ సాయం కింద మరో 75 కోట్ల డాలర్లు ఇవ్వనున్నట్లు అమెరికన్ మిలిటరీ తెలిపింది. ఇంతకుముందు 57.5 కోట్లు ఒకసారి, 1700 కోట్ల డాలర్లు ఒకసారి అందజేసింది. రష్యా దాడులను ఎదుర్కోవాలంటే తమకు తక్షణమే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు పంపాలని పశ్చిమ దేశాలను జెలెన్స్కీ తాజాగా కోరారు. రష్యన్ దళాలు ఉక్రేనియన్లను ఊచకోత కోస్తున్నాయని జెలెన్స్కీ, ఆయనకు వత్తాసు పలుకుతున్న అమెరికా, దాని మిత్ర పక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. . ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. రష్యాను క్రూరమైన దేశంగా ముద్ర వేసే ఇటువంటి యత్నాలను మానుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ను పుతిన్ హెచ్చరించారు. మస్కోవా యుద్ధ నౌక ఇటీవల నల్ల సముద్రంలో మునిగిపోవడానికి మందుగుండు పేలుడే కారణమని రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ మాత్రం తాము జరిపిన క్షిపణి దాడుల వల్లే ఆ నౌక మునిగిపోయిందని ప్రచారం చేస్తోంది.












Click it and Unblock the Notifications