రష్యా స్కూల్లో మారణహోమం... కాల్పుల ఘటనలో 11 మంది మృతి,20 మందికి గాయాలు
రష్యాలోని ఓ స్కూల్లో గుర్తు తెలియని దుండగుడు మారణహోమం సృష్టించాడు. స్కూల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రష్యా రాజధాని మాస్కోకి 72 కి.మీ దూరంలో ఉన్న కజన్ నగరంలోని ఓ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కాల్పుల సమయంలో స్కూల్లో మొత్తం 700 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల శబ్దం విని కొంతమంది విద్యార్థులు మూడో అంతస్తు నుంచి కిందకు దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాల్పుల ఘటన గురించి తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను, గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.
కాల్పులు జరిపింది ఒక్కడేనా... ఇద్దరా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. స్థానిక అధికారులు మాత్రం కాల్పులకు పాల్పడిన 19 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతని పేరు మీద గన్ లైసెన్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు జైల్లో నిందితుడిని విచారిస్తున్న క్రమంలో అతను వారిపై గట్టిగా అరిచాడని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోను కూడా అక్కడి మీడియా చానెళ్లు ప్రసారం చేశాయి. అందులో ఆ నిందితుడు తాను దేవుడిని అని... తాను ప్రతీ ఒక్కరిని ద్వేషిస్తున్నానని చెబుతున్న మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
స్కూల్లో కాల్పుల ఘటనకు ముందు పేలుడు కూడా సంభవించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా ఘటన నేపథ్యంలో కజన్ నగరంలోని అన్ని స్కూళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరులకు గన్ లైసెన్స్లకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించారు.
నిజానికి రష్యాలో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. 2018లో చివరిసారి క్రిమియా పట్టణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ కాలేజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో అప్పట్లో 19 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకున్నాడు.