చెప్పా పెట్టకుండా ఉక్రెయిన్లో ప్రత్యక్షమైన రిషి సునాక్: బాంబుల మోత మోగుతున్న వేళ..!!
కీవ్: బ్రిటన్ ప్రధానమంత్రిగా కొద్దిరోజుల కిందటే బాధ్యతలను స్వీకరించిన రిషి సునాక్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా సాగిస్తోన్న దాడులతో అల్లకల్లోలంగా తయారైన ఉక్రెయిన్లో ఆకస్మికంగా పర్యటించారు. అనూహ్యంగా ఆ దేశంలో ప్రత్యక్షం అయ్యారు. బ్రిటన్ ప్రధాని ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తారనే విషయం కొన్ని గంటల కిందటి వరకూ అక్కడి మీడియాతో సహా ఎవరికీ పెద్దగా తెలియదు. ఉక్రెయిన్ పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి కొద్దిసేపటి ముందే ఈ వార్త బయటికొచ్చింది.
కీవ్లో ప్రత్యక్షం..
అది అందరికీ తెలిసేలోగా రిషి సునాక్.. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ల్యాండ్ అయ్యారు కూడా. ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో సమావేశం అయ్యారు. జెలెన్స్కీతో కలిసి కీవ్లో కలియదిరిగారు. రష్యా సైనిక బలగాల దాడిలో ధ్వంసమైన భవనాల శిథిలాలు, యుద్ధ ట్యాంకులను పరిశీలించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా నిలుస్తామంటూ హామీ ఇచ్చారు రిషి సునాక్. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ను అప్పటికప్పుడు పంపిస్తామని పేర్కొన్నారు.
విరామం లేకుండా..
రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. దీనికి విరామం అనేది ఉండట్లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. రష్యా చేస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.
పలు నగరాలు..
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీన్ని ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తోన్నాయి.
దాడులు.. ప్రతిదాడుల వేళ..
కీలకమైన ఖేర్సన్ను రష్యా సైనికుల ఆధీనం నుంచి విడిపించుకోగలిగాయి కూడా. అక్కడి నుంచి రష్యా సైనిక బలగాలను వెనక్కి పంపించడంలో విజయంసాధించగలిగాయి. రాజధాని కీవ్ను రష్యా సైనికులు చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. ఈ దాడులు ప్రతిదాడులతో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం మొత్తం అట్టుడికి పోతోంది. ఎప్పుడేం జరుగుతుందో, ఏ రాకెట్ వచ్చి ఏ భవనాన్ని ధ్వంసం తెలియని వాతావరణం నెలకొందక్కడ.
ఇదే తొలిసారి..
ఈ పరిస్థితుల మధ్య బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. ఉక్రెయిన్లో పర్యటించడం, అది కూడా ముందస్తు సమాచారం లేకుండా అక్కడికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యుద్ధం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఓ దేశాధ్యక్షుడు లేదా ప్రధాని ఉక్రెయిన్ను సందర్శించడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. బ్రిటన్ ప్రధానిగా పగ్గాలను అందుకున్న తరువాత ఉక్రెయిన్ వెళ్లడం రిషి సునాక్కు ఇదే ప్రథమం.
అండగా ఉంటాం..
తన పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడికి భరోసా ఇచ్చారాయన. రష్యాకు ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్లను ఎదుర్కోవడానికి 125 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ను అప్పటికప్పుడు అందజేస్తామని హామీ ఇచ్చారు. అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలతో కలిసి తాము కూడా రష్యాపై అనేక రకాల ఆంక్షలు, నిషేధాజ్ఞలను విధించిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రిటన్ అండగా ఉందని చెప్పడానికే తాను ఉక్రెయిన్ పర్యటనను చేపట్టినట్లు వివరించారు.