జీ20 శిఖరాగ్ర సదస్సులో కలకలం - పుకారేనంటూ..!!
జకర్తా: ఇండోనేసియాలోని బాలి వేదికగా ఆరంభం కానున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో కలకలం చెలరేగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా, చైనా అధ్యక్షులు జో బైడెన్, గ్ఝి జిన్పింగ్ సహా వివిధ దేశాల అధినేతలు, ప్రధానులు, విదేశాంగ మంత్రులు హాజరు కావాల్సిన అత్యున్నత సమావేశం ఇది. ఇందులో పాల్గొనడానికి వారంతా ఇప్పటికే ఇండోనేసియాలోని బాలికి చేరుకున్నారు. ఈ శిఖరాగ్ర సదస్సులో చర్చించాల్సిన అంశాలపై సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య బాలికి చేరుకున్న రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తీవ్ర అనారోగ్యానికిక గురయ్యారు. తక్షణమే ఆయనను ఆసుపత్రికి తరలించారు. గుండెనొప్పితో ఆయన బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఆయనను ఓ రిసార్టులో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు ఇండొనేషియాకు చెందిన మీడియా సంస్థలు వెల్లడించాయి. అనంతరం ఆయనను బాలి ప్రావిన్స్ రాజధాని డన్పసర్లో గల సాంగ్లా హాస్పిటల్కు లావ్రోవ్ను షిఫ్ట్ చేసినట్లు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో జీ20 శిఖరాగ్ర సదస్సులో ఈ అంశం ప్రస్తావనకు రానుంది. దీన్నీ ఓ అజెండాగా పెట్టారు. తాము ఎందుకు ఉక్రెయిన్పై యుద్ధానికి దిగాల్సి వచ్చిందనే విషయంపైనా సెర్గీ లావ్రోవ్ ఓ వివరణ ఇస్తారని తెలుస్తోంది. అలాంటి కీలక సమయంలో లావ్రోవ్ గుండె సంబంధిత ఇబ్బందితో ఆసుపత్రిలో అడ్మిట్ కావడం పట్ల కలకలం చెలరేగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అన్ని దేశాలు ఆరా తీస్తోన్నాయి.
అదే సమయంలో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. సెర్గీ లావ్రోవ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. ఆయన జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి బాలికి చేరుకున్నారని, షెడ్యూల్ ప్రకారమే ఆయన తోటి దేశాల ప్రతినిధులను కలుసుకుంటున్నారని వివరించింది. ప్రస్తుతం తాను సెర్గీ లావ్రోవ్ వెంటే ఉన్నానని, ఆయన ఆరోగ్యంతో ఉన్నారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధురాలు మారియా జఖరోవా తెలిపారు. లావ్రోవ్ ఆసుపత్రిలో చేరారంటూ వచ్చిన వార్తలను చూసి, నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.